
అర్హతకు మించి వైద్యం!
సూర్యాపేటటౌన్ : నకిలీ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. అర్హతకు మించి వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏళ్లతరబడి అధికారుల కళ్లుగప్పి వైద్యం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. వారం రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్గా చలామణిఅవుతున్న బాగోతం గుట్టురట్టు చేశారు. తాజాగా గురువారం నిర్వహించిన తనిఖీల్లోనూ నలుగురు డాక్టర్ల వ్యవహారం బట్టబయలైంది.
అర్హత లేకుండానే 13 ఏళ్ల నుంచి వైద్యం
అర్హత లేకున్నా నకిలీ సర్టిఫికెట్తో 13 ఏళ్లుగా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ బాగోతం అధికారుల తనిఖీల్లో బయటపడింది. జిల్లా కేంద్రంలో ఆపిల్ స్కాన్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ ఇన్నాళ్లూ ఎండీ రేడియాలజిస్టుగా చలామణి అవుతూ వచ్చారు. అయితే గురువారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం తనిఖీల్లో కేవలం ఎంబీబీఎస్ మాత్రమే పూర్తి చేసినట్లు సర్టిఫికెట్స్ బయటపడ్డాయి. డాక్టర్ కిరణ్ తన తండ్రి వీరభద్రం పేరులోని ఇంగ్లిష్ అక్షరాలలోని ఎం.డీ. పదాలను ఎంబీబీఎస్ పక్కన చేర్చి ఎంబీబీఎస్ ఎం.డీ. రేడియాలజిస్ట్ గా నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. ఈసర్టిఫికెట్తో ఆపిల్ స్కాన్ సెంటర్ పేరుపై 2013 లో రిజిస్టర్ చేసుకోగా గతేడాది సెప్టెంబర్ నెలలో దీనిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుడ్డిగా రెన్యువల్ చేశారు. అంతేకాకుండా ఇదే స్కానింగ్ సెంటర్ లో పని చేస్తున్న మరో రేడియాలజిస్ట్ జుల్ఫిఖర్ అలీ ఖాన్ అనే డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తిచేసి ఎం.డీ.గా చెప్పుకుంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే సదరు డాక్టర్ ఎంబీబీఎస్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ లేకుండానే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వ్యవహారం బయట పడడంతో వెంటనే బోర్డు మార్చేయడం గమనార్హం.
శరత్ కార్డియాక్ కేర్ సెంటర్ సీజ్..
సూర్యాపేటలో శరత్ కార్డియాక్ కేర్ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు. గుండె సంబంధిత వైద్యం అందిస్తామని డాక్టర్ శిరీష పేరిట అనుమతి తీసుకుని అసలు డాక్టరే లేకుండా ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియనే వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం సదరు ఆసుపత్రిని సీజ్ చేశారు.
మేనేజ్మెంట్ డాక్టర్గా..
సూర్యాపేటలో పుట్టగొడుగుల్లా ఆసుపత్రులు వెలుస్తున్నాయి. కొందరు అర్హత లేని వారు కూడా వేరే వ్యక్తి ఫార్మసీ సర్టిఫికెట్, డాక్టర్ల సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుంటూ వారికి నెలనెలా జీతం చెల్లిస్తూ ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. కమీషన్ల ఎరచూపి జిల్లాలోని ఆర్ఎంపీల ను తమ వైపు తిప్పుకొని రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్లు లేకుండానే వాళే్ల్ డాక్టర్లుగా చలామణి అవుతూ కోట్లు సంపాదిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్య హాస్పిటల్ లో డాక్టర్ లేకుండానే కేవలం మేనేజ్మెంట్ హాస్పిటల్ నడిపిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తనిఖీల సమయంలో డాక్టర్ స్థానంలో మేనేజ్మెంట్కు సంబంధించిన వ్యక్తి ఉండడం గమనార్హం. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ కృష్ణ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ రవి శేఖర్ అనస్తీషియా అర్హత ఉండగా జనరల్ ఫిజీషియన్ గా అవతారం ఎత్తి ఏకంగా సర్జరీలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా హాస్పిటల్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ నిర్వహిస్తుండగా అందులో పని చేస్తున్న రేడియాలజిస్ట్ సైతం ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఉండడం కొసమెరుపు.
రెన్యువల్ చేయకుండా రెండేళ్లుగా ప్రాక్టీస్...
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి గణేష్ హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ సందీప్ కుమార్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2019 నుంచి సూర్యాపేటలో ఎం.డీ.గా చలామణి అవుతున్నారు. అయితే రెండేళ్ల క్రితం చైనా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ గడువు ముగిసినా.. రెన్యువల్ చేయకుండా నిర్లక్ష్యంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో రెండేళ్ల నుంచి ప్రాక్టీస్ చేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినా.. మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఔట్ పేషెంట్ షీట్ లను పరిశీలించి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్లకు ఫోన్ చేసి మాట్లాడి సదరు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారని నిర్ధారించారు.
రోగుల ప్రాణాలతో చెలగాటం
ఫ చదివిందొకటి.. చేసేవైద్యం మరొకటి
ఫ అర్హతలేకున్నా ఎండీ రేడియాలజిస్ట్గా ఒకరు..
ఫ ఎంబీబీఎస్ చేసి ఎండీగా మరో ఇద్దరు..
ఫ అనస్తీషియా డాక్టరే ఆపరేషన్లు చేస్తూ..
ఫ ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్గా చలామణి
ఫ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో బట్టబయలు

అర్హతకు మించి వైద్యం!