కట్టంగూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన కాసర్ల యాదమ్మ, నర్సిరెడ్డి దంపతుల ఏకై క కుమారుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి(47) పుట్టుకతో మానసిక దివ్యాంగుడు. శ్రీనివాసరెడ్డికి 25 సంవత్సరాల క్రితం వివాహం చేయగా కుమార్తె జన్మించిన మూడు సంవత్సరాల అనంతరం భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి నర్సిరెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి యాదమ్మ తన మనువరాలు, కొడుకు ఆలనాపాలన చూసుకుంటుంది. ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాసరెడ్డి తిరిగి రాలేదు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా సోమవారం ఈదులూరు గ్రామ శివారులో గల బావిలో శ్రీనివాసరెడ్డి మృతదేహం తేలి ఉండటాన్ని బంధువులు గుర్తించారు. తన కొడుకు మానసికస్థితి సరిగా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు శ్రీనివాసరెడ్డి తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.