
ఆగని అక్రమ నిర్మాణం
గార: విలువైన ప్రభుత్వ భూమి. కుటుంబ సభ్యుడు పంచాయతీ మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు కావడంతో భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. ఈ విషయమై పత్రికల్లో కథనాలు వచ్చినా.. సోమవారం జరిగే కలెక్టర్ గ్రీవెన్సులో ఆధారాలతో ఫిర్యాదు చేసినా పనులు ఆగలేదు. టీడీపీ నాయకులు కావడంతో అధికారులు కూడా నిర్మాణం వద్దకు వెళ్లడం, ఆపేయమని చెప్పడం తప్పా ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని స్థానికులు అంటున్నారు. గార మండలం అంపోలు పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో జిల్లా జైలుకు వెళ్లే ప్రధాన రోడ్డు ఆనుకొని ఉన్న సర్వే నెంబరు 12లో సుమారు 6 సెంట్లు స్థలం ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం జరుగుతోంది. గత నెల 11న భూమి ఆక్రమణపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో 12వ తేదీన ఆర్ఐ రాజేంద్ర, వీఆర్వో మోహన్ వెళ్లి పనులు నిలిపివేయాలని చెప్పారు. అప్పటికి నిర్మాణం పునాదుల స్థాయిలో ఉంది. ఇప్పుడు ఏకంగా గోడలు నిర్మాణాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నాయకుడు కావడంతో అధికారులు అటువైపు చూడటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఈ విషయమై అంపోలు–3 వీఆర్వో హర్షకిరణ్ వద్ద ప్రస్తావించగా పనులు నిలిపేయాలని నిర్మాణదారులకు చెప్పామని, తహశీల్దార్కు నివేదిక అందజేయగా, నోటీసులు ఇవ్వాలని ఆదేశించారని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూమిలో
చేపట్టిన అక్రమ నిర్మాణం
టీడీపీ నాయకులే సూత్రధారులు
అధికారులు నిలిపివేయాలని చెప్పినా ఆగని వైనం