పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 80 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు.
ప్రాణాలు బలిగొన్న ఫిట్స్
తాడిపత్రి రూరల్: మూర్చ వ్యాధి ఒకరి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి మండలం రాయలచెరువుకు చెందిన శివశంకర్ కుమారుడు మోహన్కుమార్ (25) తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన స్నేహితుడు మధుతో కలసి పనుల కోసమని ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి వెళుతుండగా తేళ్లమిట్టపల్లి వద్దకు చేరుకోగానే బైక్ నడుపుతున్న మోహన్కుమార్కు ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మోహన్కుమార్ అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


