రొళ్ల: రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జ్యోతుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయమే అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవ విగ్రహాలను భక్తులు తీసుకొచ్చిన పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించారు. సాయంత్రం రత్నగిరి ఎస్సీ కాలనీ వాసులు మేళతాళాలతో జ్యోతులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన మహిళలు హారతులను అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న నమ్మకంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరాగా, దేవాలయం కిటకిటలాడింది. పలువురు మహిళలు ఆలయ సమీపాన ఉన్న పాలబావి వద్దకు చేరుకుని గంగ పూజ చేశారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు పోతులరాజు పూజ, పుష్పాలంకరణ మహోత్సవం ఉంటుందని రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.


