కూడేరు: ఉమ్మడి అనంతపురం జిల్లాకు తాగునీరు అందించే పీఏబీఆర్ (పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్) రిజర్వాయర్ నీటి మట్టం పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 11 టీఎంసీలు కాగా, రిజర్వాయర్ భద్రతా దృష్ట్యా 5.5 టీఎంసీలకు మించి ఇరిగేషన్ అధికారులు నీటిని నిల్వ ఉంచడం లేదు. నాలుగు నెలల క్రితం వరకు డ్యాంలో 5 టీఎంసీలకు పైగానే నీరు నిల్వ ఉండేది. ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోవడం, కుడికాలువ ద్వారా 49 చెరువులను నింపడం, అనంత, శ్రీసత్యసాయి, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేస్తుండడంతో శుక్రవారం నాటికి డ్యాంలో 2.6 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. ఈ క్రమంలో మరో 30, 40 రోజుల్లో జలాశయం డెడ్ స్టోరేజ్కు చేరుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుడి కాలువకు నీటి సరఫరాను త్వరలో నిలిపి వేయనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కృష్టా జలాలను ఎలాంటి ఖర్చు లేకుండా పీఏబీఆర్కు తరలించే అవకాశం ఉన్నా ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కుప్పం ప్రాంతానికి తరలించడంపైనే సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. దీంతో రిజర్వాయర్లో నీటి నిల్వ గణనీయంగా తగ్గుతుండటంతో తాగునీటి పథకాలపై తీవ్ర ప్రభావం చూపనుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


