● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్
పెనుకొండ రూరల్: ‘కొత్త పలుకు’ పేరుతో చెత్తరాతలు రాసి వైఎస్సార్ సీపీ నేతల భార్యలను తీవ్రంగా అవమానించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. జర్నలిజం పేరుతో రాధాకృష్ణ రాసిన రోత రాతలను నిరసిస్తూ గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఆమె నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని పెనుకొండ డీఎస్పీ నర్సింగప్పకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. వీకెండ్ కామెంట్స్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఛానల్లో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసే రాధాకృష్ణ తానో జర్నలిస్టునన్న విషయం కూడా మరచిపోయారన్నారు. కేవలం వైఎస్సార్ సీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పవిత్రమైన భార్య, భర్తల బంధాన్ని తప్పు పట్టే విధంగా వర్ణించడం దుర్మార్గమన్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా...కూటమి పెద్దలు మాట్లాడక పోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, గజేంద్ర, నరసింహమూర్తి, మండల మాజీ కన్వీనర్లు బాబు, శ్రీకాంత్ రెడ్డి, సోమందేపల్లి జెడ్పీటీసీ అశోక్, నాయకులు ఎన్. నారాయణ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.


