గుంతకల్లు: స్థానిక రైల్వే డివిజన్ పరిధిలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు ఉద్యోగులకు మ్యాన్ అఫ్ మంత్ అవార్డులను డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా సోమవారం అందజేశారు. వీరిలో ట్రైన్ మేనేజర్ హనుమంతు, పాయింట్స్మెన్ సచీంద్ర ఉన్నారు. ఓ రైలు ప్రయాణికుడు గాయపడిన సమాచారం అందుకున్న ట్రైన్ మేనేజర్ హనుమంతు సకాలంలో స్పందించి సమీపంలోని రైల్వేస్టేషన్కు సమాచారం చేరవేసి మెరుగైన వైద్యసేవలు అందించడంలో సఫలీకృతుడయ్యాడు.
అలాగే బోగీ చక్రాల్లో వస్తున్న శబ్ధాల్లో తేడాను పసిగట్టి వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి పెను ప్రమాదాన్ని పాయింట్స్మెన్ సచీంద్ర నివారించాడు. ఈ నేపథ్యంలో వారిని అభినందిస్తూ మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, సీనియర్ డీఓఎం శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


