చిలమత్తూరు(హిందూపురం): సీఎం చంద్రబాబు బామ్మర్ది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత ఇలాకాలో టీడీపీకి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టి షాక్ ఇచ్చారు. అరాచక పాలన నచ్చక వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే... హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు పళనీనగర్కు చెందిన 70 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి వైఎస్సార్సీపీలోకి చేరారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో వెంకటేష్ ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ ఆ పార్టీ నేత వేణురెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, రానున్న రోజుల్లో ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరనుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో ఏఈ వెంకటేశులు, గోవిందరాజు, టి.రాజు, రాజా, మణి, నాగరాజు, సతీష్, విఘ్నేష్, మాధవన్, ప్రభాస్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి అమానుల్లా, రాష్ట్ర బూత్ కమిటీ సంయుక్త కార్యదర్శి వరుణ్రెడ్డి, నాయకులు అంబేడ్కర్ నవీన్, ముద్దిరెడ్డిపల్లి శివారెడ్డి, బండి రాము తదితరులు పాల్గొన్నారు.


