
పశు వైద్యంపై నిర్లక్ష్యం
మూగజీవాల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అత్యవసర సమయాల్లో పశువులు, జీవాలకు చికిత్స అందించే వైద్యుల పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో పశు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఈ క్రమంలోనే పశు సంవర్ధక ద్వారా అమలు చేస్తున్న పథకాలకూ దిక్కు లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.
పుట్టపర్తి: పాడి పరిశ్రమను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. జిల్లాలోని పశువుల ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తోంది. ఫలితంగా పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యసర సమయంలో వైద్యం అందక పశువులు, గొర్రెలు, కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో పాడి రైతులకు అన్ని విధాలుగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని, పశు సంవర్ధక శాఖ ద్వారా పథకాలను సకాలంలో అందజేస్తూ పాడి రైతుల ఆర్థిక బలోపేతానికి కృషి చేశారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాడి రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 60.88 లక్షలకు పైగా మూగజీవాలు
జిల్లా వ్యాప్తంగా ఆవులు, ఎద్దులు, గేదెలు కలిపి 3,33,132 వరకు ఉన్నాయి. మేకలు 4.29 లక్షలు, గొర్రెలు 30.49 లక్షలు, కోళ్లు 22.77 లక్షలు, పందులు 1,727 ఉన్నాయి. వీటన్నంటికీ చికిత్స అందించేందుకు ప్రస్తుతం జిల్లాలో సిబ్బందితో పాటు మందులకొరత తీవ్రంగా వేధిస్తోంది. బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లోని పశు వైద్యశాలలో ఒక్క డాక్టర్ కూడా లేరు. దీంతో పశు వైద్య సేవలు ఆగి పోయాయి. ఆవులకు కృత్రిమ గర్భధారణ వ్యాక్సిన్, గాలికుంటు తదితర వ్యాధుల నివారణ టీకాలు అందుబాటులో లేక పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జబ్బు బారిన పడిన పశువులు, జీవాలకు ప్రైవేట్గా చికిత్స చేయించుకునే పరిస్థితులు నెలకొన్నాయి.
గత ప్రభుత్వంలో తిరుగులేని ప్రోత్సాహం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... పాడితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మి సాగుతో పాటు పాడి పోషణపై ప్రత్యేక దృష్టి సారించారు. రాయితీతో పశు దాణా అందించారు. పశువైద్యాన్ని మరింత మెరుగు పరచారు. అత్యవసర సమయంలో పశువులను వైద్యశాలకు తరలించి నాణ్యమైన చికిత్సలు అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా అంబులెన్స్లను సమకూర్చారు. వైద్య పరీక్షల కోసం ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చారు. ఉచిత బీమాతో పాడి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడమే కాక... అమూల్ సంస్థ ద్వారా పాలకు గిట్టుబాటు ధర కల్పించారు. వీటికి భిన్నంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అమూల్ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసి పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి గండికొట్టింది. సబ్సిడీ దాణాను ఇప్పటి వరకూ అందించిన దాఖలాలు లేవు. ఉచిత బీమా పథకానికి మంగళం పాడింది. పశు వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా మొత్తానికి పశు వైద్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడుగులేస్తోంది.
ప్రైవేట్ వ్యక్తులతో గొర్రెలకు నట్టల నివారణ మందు తాపిస్తున్న కాపర్లు
సిబ్బంది లేక మూతబడిన బుక్కపట్నంలోని పశువుల ఆస్పత్రి
సిబ్బంది కొరతతో ఆగిన సేవలు
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ఇబ్బందుల్లో పాడి రైతులు
సిబ్బంది కొరత ఉంది
జిల్లాలోని పశువుల ఆస్పత్రిల్లో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. మందుల కొరత లేదు. కృత్రిమ గర్భధారణ, గాలి కుంటు టీకాలు అందుబాటులో ఉన్నాయి.
– శుభదాసు, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి
సబ్సిడీతో దాణా అందించాలి
పశు సంవర్ధక శాఖ పథకాలను పక్కాగా అమలు చేయాలి. సబ్సిడీతో దాణాను అందించాలి. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలి.
– దామోదరరెడ్డి, పాడిరైతు, జానకంపల్లి
పాడి ఆవులు చనిపోతున్నాయి
జబ్బు బారిన పడిన పాడి ఆవులకు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళితే అక్కడ డాక్టర్లు ఉండడం లేదు. అత్యసవర పరిస్థితుల్లో చికిత్స అందక పాడి ఆవులు చనిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం వైద్యులను నియమించాలి. – కృష్ణారెడ్డి, పాడిరైతు,
జానకంపల్లి, బుక్కపట్నం మండలం

పశు వైద్యంపై నిర్లక్ష్యం

పశు వైద్యంపై నిర్లక్ష్యం

పశు వైద్యంపై నిర్లక్ష్యం

పశు వైద్యంపై నిర్లక్ష్యం

పశు వైద్యంపై నిర్లక్ష్యం