
బొలెరో ఢీ – వ్యక్తి దుర్మణం
అమరాపురం: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... అమరాపురం మండలం కాచికుంట గ్రామానికి చెందిన రైతు దాసప్ప గారి హనుమంతరాయప్ప (55) శుక్రవారం ఉదయం జేసీబీ సాయంతో తన పొలంలో పనులు చేయిస్తున్నాడు. మధ్యాహ్నం పనులు చేస్తున్న డ్రైవర్, తదితరులకు భోజనం తీసుకువచ్చేందుకు అమరాపురం గ్రామానికి వచ్చాడు. ఓ హోటల్లో భోజనం పార్సిల్ తీసుకుని తిరుగు ప్రయాణమైన ఆయన ఉదుగూరు గ్రామం వద్దకు చేరుకోగానే హేమావతి వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొంది. దీంతో హనుమంతరాయప్పబైక్పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పొలాల్లో కేబుల్ అపహరణ
పుట్టపర్తి అర్బన్: మండలంలోని మూడు గ్రామాల్లో సుమారు 25 మంది రైతులకు చెందిన వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ను దుండగులు అపహరించుకెళ్లారు. జగరాజుపల్లి, వెంకటగారిపల్లి, కొత్తచెరువు మండలం గౌనికుంటపల్లి గ్రామాల్లో దసరా పండుగ రోజు, అంతకు ముందు రోజు 25 బోరు బావుల వద్ద కేబుల వైరు, స్ట్రార్టర్లు, ఇతర మోటర్ పరికరాలు అపహరణకు గురయ్యాయి. కొత్తచెరువు రైతుల ఫిర్యాదు మేరకు ఓ అనుమానితుడిని సీఐ మారుతీశంకర్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే సదరు వ్యక్తి టీడీపీ కార్యకర్త కావడంతో కేసు నమోదులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థులను ఉన్నతంగా
తీర్చిదిద్దండి
● కొత్త టీచర్ల శిక్షణ తరగతుల
ప్రారంభంలో డీఈఓ క్రిష్టప్ప
హిందూపురం టౌన్: అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కొత్త టీచర్లకు జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప సూచించారు. డీఎస్సీ–25కు ఎంపికై న టీచర్లకు శుక్రవారం హిందూపురంలోని బీఐటీ కళాశాలలో శిక్షణ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఈఓ మాట్లాడుతూ... గతాన్ని మరిచిపోకుండా లభించిన అవకాశాన్ని చిత్తశుద్ధితో ఉపయోగించుకుంటే ఏ వృత్తిలోనైనా రాణించగలుగుతారన్నారు. సమాజంలో ఎంతో గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిని సాధించడం గొప్ప విషయమన్నారు. పట్టణ, మారుమూల ప్రాంతాల్లో అవకాశం వచ్చినా అంకితభావంతో సేవలను అందించాలన్నారు. సీఎంఓ మాలిక్, మండల విద్యాశాఖాధికారులు గంగప్ప, ప్రసన్నలక్ష్మి, శేషాచలం మాట్లాడుతూ... విద్యార్థులతో మమేకం అవుతూనే తల్లిదండ్రులు, ప్రజల సహకారంతో విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్డీజీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర కుమార్, స్టేట్ రిసోర్స్ పర్సన్ బాబా, బాలాజీ నాయక్, నర్సిరెడ్డి, శేఖర్ బాబు, రామాంజినేయులు, ఆర్గనైజర్లు శ్రీనివాసరెడ్డి, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బదిలీపై 22 మంది టీచర్ల రాక
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల్లో భాగంగా జిల్లాకు 22 మంది వచ్చారు. శుక్రవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎం.ప్రసాద్బాబు సమక్షంలో కౌన్పెలింగ్ నిర్వహించి స్కూళ్లు కేటాయించారు. బదిలీల్లో జిల్లాకు వచ్చిన వారిలో హెచ్ఎంలు ఇద్దరు, పీఎస్హెచ్ఎంలు ఇద్దరు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకరు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒకరు, గణితం ముగ్గురు, పీఎస్ ముగ్గురు, బీఎస్ ఒకరు, ఇంగ్లీష్ ఒకరు, పీఈటీ ఒకరు, ఎస్జీటీలు ఏడుగురు ఉన్నారు. కాగా 3, 4 కేటగిరీలకు సంబంధించి కొన్ని స్కూళ్లు మాత్రమే ఖాళీలు చూపడంపై యూటీఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఆయా కేటగిరీల్లో అన్ని ఖాళీలను చూపించాలని డిమాండ్ చేశారు.

బొలెరో ఢీ – వ్యక్తి దుర్మణం