
చీనీ, టమాట మార్కెట్ల పరిశీలన
అనంతపురం అగ్రికల్చర్: మార్కెటింగ్ పరిస్థితులు తెలుసుకునేందుకు ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, అగ్రివాచ్ సంస్థ ప్రతినిధి హిమయుద్దీన్ తదితరులు మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ మార్కెట్, కక్కలపల్లి టమాటా మండీలను పరిశీలించారు. జిల్లాలో సాగులో ఉన్న పంటల విస్తీర్ణం, దిగుబడులు, మార్కెట్ ధరలు, రైతుల కష్టనష్టాలు, ట్రేడర్ల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని ట్రేడర్లకు సూచించారు. ప్రస్తుతం చీనీ, టమాట ధరలు కాస్త నిలకడగానే కొనసాగుతున్నట్లు తెలిపారు. ధరల్లేక రోడ్డున పడేసే పరిస్థితి తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అలాంటి పరిస్థితి ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని ట్రేడర్లు, మండీ నిర్వాహకులకు సూచించారు. పరిశీలనలో ఉద్యానశాఖ ఏడీ దేవానంద్కుమార్, ఏపీఎంఐపీ ఏపీడీ ధనుంజయ, హెచ్వో రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
చిలమత్తూరు: టేకులోడు అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 8 మందిని మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10,500 నగదు, 8 మంది ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపారు.
చిన్నారులపై కుక్క దాడి
రొద్దం: మండల కేంద్రంలోని పోలేపల్లి వీధి సమీపాన మంగళవారం ముగ్గురు చిన్నారులపై కుక్కదాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. వెంటనే వీరిని పావగడ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇదే కుక్క సోమవారం కూడా మరో ముగ్గురిపై కూడా దాడిచేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
మద్యం తరలిస్తున్న
ఇద్దరి అరెస్ట్
హిందూపురం టౌన్: హిందూపురం ఎౖకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలుచోట్ల దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, వారి నుంచి 192 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు పృథ్వీ, ఫరూక్, నారాయణస్వామి, హెచ్సీ నరసింహ, వెంకటేష్, రమణ, సతీష్, పీసీలు అంజి, రవీంద్ర, కుమార్, రంగధామ్, శివ, సుధాకర్రెడ్డి, ఉస్మాన్, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ రమేష్నారాయణకు ‘కీర్తి’ పురస్కారం
అనంతపురం కల్చరల్: తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా అందించే ‘కీర్తి పుస్కారం’ అనంతపురానికి చెందిన ప్రసిద్ధ సాహితీ–విద్యావేత్త డాక్టర్ పతికి రమేష్నారాయణ అందుకున్నారు. మంగళవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ప్రదానోత్సవ సభలో యూనివర్సిటీ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, శాంతా బయోటెక్స్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాదరెడ్డి, తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండీ గణపతిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంత సాహితీక్షేత్రంలో బహుగ్రంథకర్తగానే కాకుండా అనువాదరంగంలో విశేష ప్రతిభాపాటవాలతో జనచైతన్యం చేస్తున్నందుకు కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారన్నారు. ప్రిన్సిపాల్గా, రచయితగా, సామాజికవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయనకు లోతైన జ్ఞానం ఉందని కొనియాడారు. పురస్కారమందుకున్న డాక్టర్ రమేష్నారాయణను డాక్టర్ ఉమర్ఆలీషా ప్రతినిధులు రియాజుద్దీన్, షరీఫ్, సాహిత్యభారతి జిల్లా అధ్యక్షుడు గుత్తా హరి, కార్యదర్శి తోట నాగరాజు, సుంకర రమేష్ అభినందించారు. జిల్లాకు ప్రత్యేక గౌరవం తెచ్చారన్నారు.
యూరియా కొరత తీరేదెన్నడు?
ఆత్మకూరు: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. కావాల్సినంత యూరియా అందివ్వడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మంగళవారం తోపుదుర్తి గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గంటల తరబడి లైన్లో పడిగాపులు కాసి యూరియా తీసుకెళ్లారు. మండలంలో మదిగుబ్బ, సింగంపల్లి, సనప, బి.యాలేరు, తోపుదుర్తి గ్రామాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. అవసరానికి తగ్గట్టు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

చీనీ, టమాట మార్కెట్ల పరిశీలన

చీనీ, టమాట మార్కెట్ల పరిశీలన