
తాగు వినియోగం లేదా!
నిరుపయోగంగా గోదావరి సంపు
● కోమటిబండ నుంచి పైపులైన్
● కలగానే గోదావరి, మంజీరా అనుసంధానం
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు
శివ్వంపేట(నర్సాపూర్): తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్ భగీరథ ద్వారా మూడు, నాలుగేళ్ల క్రితం శివ్వంపేటలో నిర్మించిన గోదావరి నీటి సంపు వృథాగా ఉంది. నర్సాపూర్ నియోజకవర్గానికి గోదావరి జలాలు అందించాలనే ఉద్దేశంతో పైపులైన్ పనులు, నీటిని నిల్వ చేసేందుకు శివ్వంపేటలో 800 కేఎల్ సంపును నిర్మించారు. కానీ సంపుని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదు. ప్రస్తుతం మంజీరా నీటి ఎద్దడి నెలకొన్న సమయంలో గోదావరి నీరు అందించేందుకు అవకాశం ఉన్నప్పటికీ సంపు నిర్వహణ లోపంతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రూ.30 కోట్లతో..
గజ్వల్ నియోజకవర్గం కోమటిబండ నుంచి గోదావరి జలాల (హెచ్ఎండబ్యుఎస్) ద్వారా నర్సాపూర్ నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో అందుకు అవసరమైన రూ.30 కోట్లు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. గతంలో మంజీరా నీరు గజ్వేల్ నియోజకవర్గానికితీసుకెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా బోరపట్ల నుంచి ఏర్పాటు చేసిన పైపులైన్ ద్వారా రివర్స్ పంపింగ్ గుండా.. అక్కడి నుంచి ఇక్కడికి నీటిని తరలించే ప్రక్రియ చేపట్టారు. కోమటిబండ నుంచి నర్సాపూర్ పీర్లగుట్ట వరకు ఉన్న 45 కిలో మీటర్ల పైపులైన్లో 16 కిలోమీటర్లు కొత్తలైన్ ఏర్పాటు చేశారు. పీర్లగుట్ట వరకు చేరిన నీటిని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్, శివ్వంపేట, హత్నూర, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, చిలిపిచెడ్ మండలాల్లోని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
నిరుపయోగంగా సంపు
గోదావరి జలాల నిల్వకోసం మండల కేంద్రమైన శివ్వంపేటలో 8లక్షల లీటర్ల కెపాసిటీ సంపు నిర్మాణం చేపట్టారు. ఇక్కడ 100 హెచ్పి కెపాసిటీ మోటార్లు మూడు, 60 హెచ్పీ కెపాసిటీ మూడు మోటార్లు బిగించి చిన్నగొట్టిముక్ల వద్ద నున్న ఓహెచ్బిఆర్కు తరలించనున్నారు. అక్కడి నుంచి పీర్లగుంట, దౌల్తాబాద్ వద్ద నున్న ఓహెచ్బిఆర్కు నీటి తరలింపు ఉంటుంది. ప్రస్తుతం వారం రోజుల నుంచి మంజీరా నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. గోదావరి నీటి కోసం ఏర్పాటు చేసిన పైపులైన్, సంపు వినియోగంలో లేకపోవడంతో కోట్ల రూపాయలతో చేసిన పనులు నిరుపయోగంగా మారాయి. కలెక్టర్ స్పందించి గోదావరి జలాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
నర్సాపూర్కు గోదావరి జలాలు అందించేందుకు చేపట్టిన సంపుని వినియోగంలోకి తీసుకొస్తాం. కోమటిబండ నుంచి శివ్వంపేట వరకు ఉన్న పైపులైన్ గేట్వాల్, హెర్వాల్స్లో చిన్నపాటి మరమ్మతులు చేపట్టి గోదావరి నీరు ఇక్కడి ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటాం. అవసరం మేరకు గోదావరి, మంజీరా నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
– నాగభూషణం, వాటర్గ్రిడ్ ఈఈ