
ఒకేసారి 3నెలల రేషన్
రేపటి నుంచి ప్రారంభం
● రేషన్ దుకాణాలకు చేరుతున్నసన్న బియ్యం నిల్వలు ● సరిహద్దు జిల్లాల నుంచి దిగుమతి ● పంపిణీ సమయం పెంచే యోచన! ● వర్షాల ముప్పు నేపథ్యంలోప్రభుత్వం చర్యలు
నారాయణఖేడ్: ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ను జూన్ నెలలో ఒకేసారి ఇవ్వనున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో అకాల వర్షాలు కురుస్తుండటం, వరదలకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రభుత్వం ముందస్తుచర్యలు చేపట్టింది. వర్షాలు, వరదల ఇబ్బందుల నేపథ్యంలో పేదలకు ముందుగానే మూడు నెలల సన్న బియ్యం అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం అందుకనుగుణంగా చర్యలు ప్రారంభించింది. మూడు రోజులుగా జిల్లాలోని రేషన్ దుకాణాలకు సన్న బియ్యం రవాణాను చేస్తోంది. జూన్, జూలై, ఆగస్టు నెలల కోటా సన్న బియ్యం ఒకే మారు లబ్ధిదారులకు అందజేయనున్నారు.
పక్క జిల్లా నుంచి బియ్యం
జిల్లాకు సరిహద్దునే ఉన్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సన్న బియ్యాన్ని జిల్లాకు తరలిస్తున్నారు. స్టేజ్–1 కాంట్రాక్టర్ ద్వారా జిల్లాకు బియ్యం సరఫరా చేపట్టి ఎంఎల్ఎస్ పాయింట్లకు స్టేజ్–2 కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే సరిపడా గోడౌన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు రోజుల నుంచి జిల్లాలోని ఆయా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కొద్ది కొద్దిగా చేపడుతున్నారు. రేషన్ దుకాణాల్లోనూ అంతస్థాయిలో బియ్యం నిల్వలకు స్థలం లేకపోడంతో కొద్దికొద్దిగా సరఫరా చేసి జూన్ 1న బియ్యం పంపిణీని ప్రారంభిచనున్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తూ నిల్వలు పూర్తయిన కొద్దీ స్టేజ్–2 కాంట్రాక్టర్ ద్వారా సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు.
22వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం
జిల్లాలో 3,81,017 రేషన్ కార్డులు ఉండగా ఈ కార్డుల్లో 13,08,439మంది సభ్యులు నమోదై ఉన్నారు. ఇందులో తెల్ల రేషన్ కార్డులు 3,54,808, అంత్యోదయ 26,109, అన్నపూర్ణ 100 కార్డులున్నాయి. వీరందరికీ ప్రతీనెల 7,600 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుంది. కాగా, మూడు నెలలకు సంబంధించి 22వేల మెట్రిక్ టన్నుల మేర బియ్యం నిల్వలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆహార భద్రతా కార్డు కలిగిన వారికి తలా 6కిలోల చొప్పున కార్డులున్న సభ్యుల సంఖ్య మేర అందరికీ ఒకేసారి మూడునెలల బియ్యం అందిస్తారు. అంత్యోదయ కార్డుదారులకు 35కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు 10కిలోల చొప్పున ఉచితంగా అందిస్తారు. బియ్యం పంపిణీ 15రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా ఈ మారు మూడు నెలల బియ్యం పంపిణీ ఉన్నందున సమయం కూడా పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలలకు సంబంధించి ఒకేసారి సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. మూడు రోజులుగా స్టేజ్–2 కాంట్రాక్టర్ ద్వారా దుకాణాలకు బియ్యం సరఫరా ప్రారంభం అయ్యింది. మూడు నెలలకు సంబంధించి పంపిణీ ఉన్నందున జనాలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. పంపిణీ సమయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– అంబదాస్ రాజేశ్వర్,
పౌరసరఫరాల జిల్లా మేనేజరు, సంగారెడ్డి

ఒకేసారి 3నెలల రేషన్