
● టాస్క్లు, కమీషన్ల పేరుతో సైబర్ మోసం
● రూ.11.10 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని
● మరో రెండు ఘటనల్లో ప్రైవేట్ ఉద్యోగులు
పటాన్చెరు టౌన్ : పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్కు వచ్చిన మెసేజ్ కు స్పందించి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.11.10 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ మండల బీరంగూడ సాయి భగవాన్ కాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి పార్ట్ టైం జాబ్ అంటూ వాట్సాప్ కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి తన వివరాలను నమోదు చేశారు. సైట్ నిర్వాహకులు ఆమెకు ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో ఉద్యోగిని ముందుగా రూ.2 వేలు చెల్లించి టాస్కులు చేయడం మొదలుపెట్టారు. తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు వ్యాలెట్లో చూపిస్తూ వచ్చారు. ఈ క్రమంలో బాధితురాలు మొత్తం రూ.11.10 లక్షలు చెల్లించారు. చివరికి తాను పెట్టిన నగదుతోపాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా అపరిచితులు స్పందించలేదు. బాధితురాలు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అమీనన్పూర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రూ.6 లక్షల 54 వేలు..
అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట్ దుర్గానగర్కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి మార్చి 2వ తేదీన టెలిగ్రామ్ ద్వారా జాబ్ ఆఫర్ అంటూ మెసేజ్ వచ్చింది. వెంటనే అతడు తన వివరాలను నమోదు చేసి నగదు ఇన్వెస్ట్ చేస్తూ ఇచ్చిన టాస్కులు పూర్తి చేశాడు. మొత్తం రూ.6 లక్షల 54 వేలు పెట్టుబడి పెట్టాడు. చివరికి తాను పెట్టిన నగదుతో పాటు కమీషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆదివారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో అమీన్పూర్ నరేందర్ నగర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఫిబ్రవరి 13వ తేదీన పార్ట్టైం జాబ్ అంటూ మెసేజ్ వచ్చింది. బాధితుడు తన వివరాలు నమోదు చేసి మొత్తం రూ.1.17 లక్షలు పెట్టుబడి పెట్టాడు. చివరికి తాను పెట్టిన నగదుతో పాటు కమీషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. బాధితుడు ఆదివారం అమీన్పూర్ పోలీసుల ఫిర్యాదు చేశారు.