● వివిధ సమస్యలపై 270 దరఖాస్తుల రాక ● అర్జీలు పెండింగ్ పెట్టొద్దు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్లఅర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భారీగా బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యను కలెక్టర్కు విన్నవించుకునేందుకు వస్తున్నారు. ఈ సోమవారం వివిధ సమస్యలపై 270 మంది దరఖాస్తులు అందజేశారు. ఈ అర్జీలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్ పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
పెద్దూరు శివారులోని సర్వేనంబర్ 408లోని 14 గుంటల భూమిని వివిధ అభివృద్ధి పనులకు తీసుకున్నారు. ఇందులో సుమారు ఆరుగురు రైతులు భూమి కోల్పోయాం. మాకు మరో ప్రాంతంలో భూమి లేదా పరిహారం ఇప్పించాలి. – పెద్దూరు భూ బాధితులు
మాది చంద్రంపేట. నాకున్న రెండు బ్యాంకు ఖాతాల ద్వారా నెలకు రూ.2,500 చొప్పున సహార క్రెడిట్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకులో జమచేశాను. ఆ డబ్బుల కాలపరిమితి ముగిసింది. నా ఖాతాలో జమయిన డబ్బులు ఇప్పించండి.
– సుద్దాల ఎల్లవ్వ, చంద్రంపేట
తంగళ్లపల్లి మండలం చింతల్ఠాణా గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు సరిపోవడం లేదు. గతంలో మంజూరు చేసిన ట్రాక్టర్ ఈఎంఐలు, విద్యుత్ బకాయిలు ఉన్నాయి. జీపీ ఉద్యోగుల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటికీ గ్రామపంచాయతీ గ్రాంట్ సరిపోవడం లేదు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో మా గ్రామపంచాయతీకి అదనపు గ్రాంట్ మంజూరు చేయాలి.
– గుర్రం అనసూర్య, సర్పంచ్, చింతల్ఠాణా


