
కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ
● ఎన్టీపీసీ హెచ్ఆర్లో దుస్థితి ● పట్టించుకోని యాజమాన్యం ● ఇబ్బందుల్లో శ్రామికులు
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులో కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. స్థానిక పరిపాలనా భవనంలోని హెచ్ఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కొందరు.. కార్మికుల గేట్పాస్లతోపాటు వెహికిల్ పాస్లు జారీచేసే విభాగంలోని కొందరు ఉద్యోగులు.. ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో హెచ్ఆర్ విభాగంలో శాశ్వత ఉద్యోగులు విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం వారిస్థానంలో కాంట్రాక్టు విధానంలో కొందరికి విధులు కేటాయించింది. ఇలా కాంట్రాక్ట్ పద్ధతిన హెచ్ఆర్ విభాగంలో పనిచేసే వారు కార్మికులను లంచాల కోసం వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గేట్, వాహన పాస్లకు ఇబ్బంది..
ప్రాజెక్టులోని వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించే కార్మికులు.. తమ గేట్పాస్ రెన్యూవల్తోపాటు తమ వాహనం కోసం గేట్పాస్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఉంటేనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రాజెక్టులోకి అనుమతిస్తారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు హెచ్ఆర్ విభాగంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు.. గేట్ పాస్లు మంజూరు చేసి.. వాహనం పాస్లకు వివిధ కారణాలు చూపుతూ లంచాలు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.
డబ్బులిస్తేనే పునరుద్ధరణ..
ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికుల వివరాల నమోదు కోసం ఎన్టీపీసీ కాంట్రాక్టర్స్ లేబర్ ఇన్ఫర్మేషన్ మేనే జ్మెంట్ సిస్టం(క్లిమ్స్) విధానం అమలు చేస్తోంది. ఇందుకోసం కార్మికుడికి ఒక నంబర్ కేటాయిస్తోంది. తద్వారా కాంట్రాక్టు కార్మికుడి వివరాలన్నీ సంస్థ అధీనంలోకి వెళ్తాయి. కార్మికుడు పనిచేసే విభాగం సమాచారం క్రోడీకరింస్తుంది. ఈ క్రమంలో కొందరు కార్మికుల పేర్లు క్లిమ్స్లో నమోదు కాలేదని, వివరాలు సరిగ్గా లేవని చెబుతూ హెచ్ఆర్లోని కొందరు ఉద్యోగులు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన వారికి పాస్లు పునరుద్ధరిస్తున్నారని అంటున్నారు. ఇలా చాలామంది కార్మికులు నిరక్షరాస్యులు కావడంతో హెచ్ఆర్ విభాగం చెప్పిందే వేదంగా మారుతోంది.
వారసత్వ ఉద్యోగాల్లోనూ వసూళ్లు..
వయోభారంతో ఉద్యోగ విరమణ పొందే కాంట్రాక్టు కార్మికులు.. వారిస్థానంలో తమ వారసులకు ఉద్యోగావకాశాలు కల్పించే ఒప్పందం ఉంది. ఈ క్రమంలో వారసుల నియామకాల కోసం అర్జీలు పెట్టుకుంటే.. హెచ్ఆర్లోని కొందరు రోజుకో వంకచూపుతూ నెలల తరబడి జాప్యం చేస్తున్నారని, కొందరిని కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. చేసేదేమీ లేక కొందరు బాధితులు ఎంతోకొంత ముట్టజెబుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి లంచం తీసుకున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో స్థానచలనం కల్పించినట్లు సమాచారం. అయినా, చాలామంది కాంట్రాక్టు ఉద్యోగులు లంచాలు తీసుకోవడం మానేయడం లేదని అంటున్నారు.
విచారణ జరుపుతాం
ఎన్టీపీసీ రామగుండం పరిపాలనా భవనంలోని హెచ్ఆర్ విభాగంలో మా కాంట్రాక్టు వర్క్ ఉంది. నేను పదిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నా. అయినా, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతాం.
– గోవర్ధన్రెడ్డి, కాంట్రాక్టర్

కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ