
చిన్నారులకూ ఆధార్ం ఉండాల్సిందే!
● జిల్లాలో 0–6 ఏళ్లలోపు పిల్లలు 3,743 మంది ● తొలుత వీరందరికీ జనన ధ్రువీకరణ పత్రాలిచ్చేలా చర్యలు ● మే 31 నాటికి అందరికీ ఆధార్కార్డులు
సాక్షి, పార్వతీపురం మన్యం: ఆధార్లేని బాలలందరికీ ఈ నెల 31వ తేదీ నాటికి ఆధార్ కార్డులను మంజూరు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో 0–6 ఏళ్లలోపు వయసు గల పిల్లలు 3,743 మంది ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో చాలా వరకు జనన ధ్రువీకరణ పత్రాలు లేనందున ఆధార్ కార్డులు మంజూరుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత వీరందరికీ జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆధార్ కార్డులు లేని బాలల జాబితాలను ఆయా మండలాలకు పంపించారు. పిల్లల జనన వివరాలు సంబంధిత అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటాయి. ఆ వివరాల ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు పిల్లల గృహాలకు వెళ్లి తల్లిదండ్రులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఆ సమయానికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేలా ఎంపీడీవోలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. స్వీకరించిన దరఖాస్తులను డిజిటల్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు నమోదు చేసి, మే 18వ తేదీలోగా జనన ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయాలి. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆధార్ సిబ్బంది ఆయా మండలాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించి, ఆధార్లేని బాలలందరికీ నమోదు ప్రక్రియను చేపడతారు.
ఆ మండలాల్లో అధికం...
మే 31వ తేదీ నాటికి జిల్లాలోని 3,743 మందికి ఆధార్ కార్డులు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పాచిపెంటలో 989, కురుపాంలో 434 , గుమ్మలక్ష్మీపురంలో 277, మక్కువ, సాలూరు, సీతంపేట తదితర ప్రాంతాల్లో అధికంగా జనన ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు స్వీకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.