
ఒడిశాకు వరాల జల్లు
రాష్ట్రంలో రూ.1700 కోట్ల పైబడి రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
గుజరాత్, ఒడిశా మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ప్రారంభం
భువనేశ్వర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక రోజు రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర రైల్వే రంగానికి వరాల జల్లు కురిపించారు. ఝార్సుగుడలో శనివారం అట్టహాసంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన మంత్రి రూ.1,700 కోట్ల పైబడి విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉప ముఖ్యమంత్రులు ప్రభాతి పరిడా, కనక వర్ధన్ సింగ్ దేవ్, కేంద్ర మంత్రి జుయెల్ ఓరాం, రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్కుమార్ పూజారి తదితరులు పాల్గొన్నారు.
అమృత్భారత్ ప్రారంభం..
గుజరాత్లోని సూరత్ (ఉధ్నా), రాష్ట్రంలో గంజాం జిల్లా బరంపురం మధ్య అమృత్భారత్ ఎక్స్ప్రెస్ రైలుసేవలను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ప్రధానంగా ఇరు రాష్ట్రాల్లో కార్మిక వర్గాలకు ఈ రైలు సేవలు దోహదపడతాయని గంజాం జిల్లా ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు తర్వాత బరంపురం రైల్వే రంగంలో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంటోంది. అందుకు తార్కాణంగా గుజరాత్, గంజాం జిల్లా మధ్య ప్రత్యక్ష అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. బరంపురం – సూరత్ (ఉధ్నా) అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలతో రాష్ట్రంలో గంజాం, రాయగడ, కలహండి, బొలంగీరు, నువాపడా, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఛత్తీస్గడ్లో మహాసముంద్, రాయ్పూర్, దుర్గ్, మహారాష్ట్రలో గోండియా, నాగ్పూర్, వార్దా, అమరావతి, అకోలా, బుల్ధానా, జలగాంవ్, ధూలే, నందర్బార్, గుజరాత్లో సూరత్ జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది.
●రూ. 273 కోట్లు వ్యయ ప్రణాళికతో సంబల్పూర్, సర్లా మధ్య రైలు ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణం సర్లా స్టేషన్ వద్ద రద్దీని తొలగించి రద్దీగా ఉండే సంబల్పూర్ – ఝార్సుగుడ మార్గంలో రైళ్ల నిరంతర కదలికతో బొగ్గు, ఖనిజ, పారిశ్రామిక సరుకు రవాణాకు మార్గం సుగమం చేయనుందని, పారిశ్రామిక విస్తరణతో ముడిపడిన ఆర్థిక పురోగతి గణనీయంగా ఊపందుకుంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
● కొరాపుట్ – బైగూడ మార్గంలో రూ. 481 కోట్ల వ్యయంతో 34 కిలోమీటర్ల పొడవున డబ్లింగు ప్రాజెక్టుని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ మార్గంలో ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపును సులభతరం అవుతుంది. కొరాపుట్ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుంది.
● మనబార్ – కొరాపుట్ – గోరాపూర్ మార్గంలో రైలు మార్గం రెట్టింపు రూ. 955 కోట్ల విలువైన 82 కిలోమీటర్ల పొడవైన డబ్లింగు ప్రాజెక్టు జాతీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ప్రాజెక్టుతో బైలాడిల్లా గనులు, దేశ వ్యాప్తంగా ఉక్కు కార్ఖానాలకు ఇనుప ఖనిజం రవాణా వేగవంతమై బహుముఖ అభివృద్ధికి దోహదపడుతుంది. కొరాపుట్ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) జిల్లాల్లో ప్రయాణికుల, సరుకు రవాణా రంగంలో రైలు సేవలు మెరుగుపడతాయి.

ఒడిశాకు వరాల జల్లు

ఒడిశాకు వరాల జల్లు