
అంగుల్లో ఆడ ఏనుగు మృతి
భువనేశ్వర్: అంగుల్ జిల్లా చెండీపొదా అటవీ ప్రాంతం డొంగాపాల్ సమీపంలో సౌరశక్తితో నడిచే కంచె దగ్గర ఆడ ఏనుగు చనిపోయి పడి ఉన్నట్లు దృష్టికి వచ్చింది. దీని వయసు దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉంటుందని అటవీ అధికారుల అంచనా. ఈ జిల్లాలో వారం రోజుల స్వల్ప నిడివిలో వరుసగా ఇది రెండో ఏనుగు మరణం కావడం కలవరం సృష్టిస్తోంది. అడవి జంతువులు జనావాసాల్లోకి చొరబడకుండా సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న భద్రత కంచె ఏనుగులకు ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ భూముల్లోకి ఏనుగులు చొరబడి పంట నష్టం నివారించేందుకు రైతాంగం ఈ చర్యకు పాల్పడుతున్నారు. గత నెల 31న ఇటువంటి ఘటనలో అంగుల్ జిల్లా బొంతొలా అటవీ మండల పరిధిలో తొలొసొరా సమీపంలో 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల ఒక గున్న ఏనుగు మృతి చెందింది. తాజా మరణానికి కార ణం అస్పష్టంగా ఉందని అటవీ అధికారుల సమాచారం. శవ పరీక్ష నివేదిక అందితే స్పష్టం అవుతుందని వేచి చూస్తున్నారు. జనావాసాల్లో ఏనుగుల చొరబాటుతో తలెత్తే సంఘర్షణను తగ్గించే లక్ష్యంతో అటవీ శాఖ సౌర విద్యుత్ భద్రత కంచె చేపట్టిన చొరవలో భాగం. తాజా సంఘటనల దృష్ట్యా అటువంటి కంచెల దగ్గర సంభవిస్తున్న ఏనుగుల మరణాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. అంగుల్, ఢెంకనాల్ మరియు కెంజొహర్ వంటి అటవీ సరిహద్దు జిల్లాల్లో ఈ విషమ పరిస్థితి తాండవిస్తుంది.