
రాయగడ మామిడికి డిమాండ్
రాయగడ: సేంద్రియ ఎరువులతో పండించే రాయగడ మామిడి పండ్లకు దేశ, విదేశాల్లో మంచి గిరాకీ ఉందని జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమీపంలో సోమవారం ఒర్మాస్ సంస్థ ఏర్పాటు చేసిన మామిడి మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని కాసీపూర్, రాయగడ, బిసంకటక్, కొలనార, మునిగుడ, కల్యాణసింగుపూర్ తదితర ప్రాంతాల్లో పండే మామిడి పండ్లు దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. గతేడాది ఇటలీ, పోలాండ్ వంటి దేశాలకు రాయగడ మామిడి పండ్లు ఎగుమతి అయ్యాయన్నారు. ఢిల్లీ, భువనేశ్వర్ వంటి ప్రారిశ్రామిక ప్రాంతాలకు ఇక్కడి మామిడి ఎగుమతి జరిగి రైతులు మంచి లాభాలను ఆర్జించినట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ఇక్కడి మామిడిని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఓర్మాస్ రాయగడ శాఖ ముఖ్య సంచాలకులు మనోజ్ కుమార్ పాత్రో, జి.లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఫార్మ్ ప్రోడెక్ట్ సంస్థలకు చెందిన మహిళా రైతులు ఈ మేళాలో పాల్గొని, వారు పండించిన మామిడి పండ్లను ఈ ప్రదర్శనలో ఉంచారన్నారు. మార్కెట్ ధరల కన్నా ఇక్కడ అతి చౌకగా మామిడి పండ్లు లభించడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి సేంద్రియ ఎరువుల సహాయంతో పండించినట్లు తెలిపారు. అత్యంత ప్రాధాన్యత గల అమరాపల్లి, బంగినపల్లి, సుందరి, మల్లిక, దశహరి వంటి ఏడు రాకాల మామిడి పండ్లు ప్రదర్శనలో చోటు చేసుకున్నాయని వివరించారు. ఈ నెల 6వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని, కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మామిడి మేళాకు సంబంధించిన ప్రచార రథాన్ని కలెక్టర్ పట్వారి ప్రారంభించారు. రాయగడ, జేకేపూర్లో ఈ మేళా కొనసాతున్నట్లు పాత్రో తెలియజేశారు.
మేళాను ప్రారంభించిన కలెక్టర్ ఫరూల్ పట్వారి

రాయగడ మామిడికి డిమాండ్