
బృందావన విహార్లో 45 తులాల బంగారం చోరీ
పర్లాకిమిడి: పట్టణంలోని నటరాజ్ సినిమా హాల్ ప్రాంతం బృందావన విహార్లో పట్టపగలు ఒక ఇంట్లో చోరీ జరిగి 45 తులాల బంగారం దోచుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నటరాజ్ సినిమా హాల్ బృందావన విహార్ లో మూడంస్తుల భవనంలో స్వర్ణలతా పాల్ తన అన్నదమ్ముడు, తల్లి, భర్తతో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం 5.30 గంటలకు మందిరానికి తల్లి వెళ్లినపుడు ఫ్యామిలీ అంతా రెండో అంతస్తులో నిద్రిస్తున్నారు. దొంగలు మొదటి అంతస్తులోకి వెళ్లి బీరువాలో ఉన్న 45 తులాల బంగారం వస్తువులు దోచుకున్నట్టు ఆదర్శ పోలీసు స్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. యజమాని పార్ధరాజ్ పాల్ ఫిర్యాదు మేరకు స్థానిక ఆదర్శ పోలీసు స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగతనం జరిగిన ఇంటిలో సైంటిఫిక్ టీం వచ్చి దర్యాప్తు ప్రారంభించినట్టు ఐఐసీ ప్రశాంత్ భూపతి తెలియజేశారు.
హత్య కేసులో నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష
రాయగడ: ఒక హత్య కేసుకు సంబంధించి జిల్లా అదనపు జడ్జి అక్షన స్వయి నిందితునికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు మరో రూ.50 వేల జరిమానా విధించారు. జరిమానాను చెల్లించలేకుంటే మరో ఏడాది అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. తన కూతురిని గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు సనొమాటికొన గ్రామానికి చెందిన దుర్యొ మాఝి అనే వ్యక్తి ప్రకాష్ ప్రధానిపై టికిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు నిందితుని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును శనివారం విచారించిన జిల్లా అదనపు జడ్జి ఈ మేరకు తీర్పునిచ్చారు.
విషపూరిత పుట్టగొడుగులు తిని ముగ్గురికి అస్వస్థత
రాయగడ: అడవుల్లో లభించే విషపూరిత పుట్టగొడుగులు వండుకు తిన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి శెరిగుమ్మ పంచాయతీలోని తురచితొరాయి గ్రామంలో ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రామి బెడిసిక శనివారం మధ్యాహ్నం అడవికి వెళ్లి వంట చెరుకుని తీసుకువస్తున్న సమయంలో దారిలొ పుట్టగొడుగు కనిపించింది. దాన్ని సేకరించి రాత్రి ఇంటిలొ అంతా వండుకుని తిన్నారు. మధ్యరాత్రి రామి బెడిసిక కు చెందిన మూడేళ్ల కొడుకు దిల్లి బెడిసికకు కడుపు నొప్పి వాంతులయ్యాయి. అనంతరం రామి, అతని భార్య సదారి బెడిసికకు కూడా వాంతులు కావడంతో తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. ఇరుగుపొరుగు వారు వారి పరిస్థితిని చూసి వెంటనే ఆంబులెన్స్ సాయంతో కల్యాణసింగుపూర్ ప్రాథమిక ఆరొగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు వెంటనే వారికి చికిత్స చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆరోగ్యం కుదుట పడటంతో ఆదివారం ఉదయం వారిని గ్రామానికి తరలించారు.
ఉద్యోగ విరమణ రోజే చనిపోయాడు..
మల్కన్గిరి: ఉద్యోగ విరమణ చేసిన రోజునే ఓ వ్యక్తి మృతి చెందాడు. మల్కన్గిరి మత్తిలి సమితి దలపతిగూఢ గ్రామానికి చెందిన భీమ్సేన్ ప్రధాన్ (60) పంచాయతీ పీఈవోగా పని చేశారు. కొన్ని నెలల క్రితం నవరంగ్పూర్ జిల్లాకు బదిలీ అయింది. మే 31వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. అయితే అదే రోజు రాత్రి ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేక తోటి ఉద్యోగి సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం స్వస్థలం మత్తిలి దళపతిగూఢ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాన్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

బృందావన విహార్లో 45 తులాల బంగారం చోరీ