
కఠిన చర్యలు తీసుకోవాలి
జయపురం: జర్నలిస్టుల మీద దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్కళ జర్నలిస్టుల సంఘం కొరాపుట్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు జర్నలిస్టుల సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు నేతృత్వంలో జర్నలిస్టు ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝికి ఉద్దేశించిన వినతిపత్రం కలెక్టర్కు శుక్రవారం అందజేశారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ‘బొడొకబొరో’ పత్రికలో పనిచేస్తున్న జర్నిలిస్టు బిజయ ప్రధాన్ను బంధించి కాలు చేతులు కట్టేసి దాడులు జరిపారన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాత్రికేయుల సురక్షా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసినవారిలో సంఘ రాష్ట్ర కార్యదర్శి నృసింహ బ్రహ్మ, వర్కింగ్ కార్యదర్శి జయసింగ్ పతా సెట్టి, సుదర్షన పాత్రో, పి.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.