
భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జైలు శిక్ష
రాయగడ: కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్తకు గుణుపూర్ ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగార జైలు శిక్షను విధించింది. కేసు న్యాయవిచారణ చేసిన ఏడీజే దేవదత్త పట్నాయక్ ఈమేరకు మంగళవారం నాడు తన తీర్పును ప్రకటించారు. అదేవిధంగా జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయలు జరిమానా చెల్లించాలని.. లేనిపక్షంలో మరో సంవత్సరం జైలు శిక్షను అనుభవించాలని తన తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో అయిదుగురు నిందితులను నిర్దొషులుగా తీర్పునిచ్చారు. గుణుపూర్ సబ్ డివిజన్ పరిధిలోని పద్మపూర్లో గల కొత్తవీధిలో నివసిస్తున్న హృషికేష్ సాహు తన భార్య సంధ్యారాణిని గొడ్డలితో నరికి హత్యకు పాల్పడినట్టు సంధార్యాణి చెల్లెలు 2020 జనవరి 27వ తేదీన పద్మపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి నిందితుడు హృషికేష్ సాహుతో సహా మరో ఐదుగురిపై కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా హృషికేష్ అప్పట్లో పరారయ్యాడు. అనంతరం ఆయనను 2020 అక్టోబర్ 20వ తేదీన హృషికేస్ను కూడా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసు విచారణలోకి రాగా మంగళవారం ఏడీజే పట్నాయక్ 18 మంది సాక్షులను విచారించిన అనంతరం హృషికేష్ను ఏవజ్జీవ కారగార శిక్షను విఽధించగా మిగతా ఐదుగురిని నిర్దోషులుగా విడుదల చేస్తు తీర్పునిచ్చారు.