పర్లాకిమిడి : మహేంద్ర తనయ నది ఒడ్డున ఉన్న బృందావన ప్యాలెస్లో ఈ నెల 6న చోరీకి గురైన పురాతన ఐరన్ రైలింగ్పై పోలీసులు దర్యాప్తు చేసి దోషులను అరెస్టు చేయాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు పైల మురళీక్రిష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదర్శ పోలీసుష్టేషన్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. హెరిటేజ్ ప్యాలెస్ సంరక్షణకు వాచ్మ్యాన్ను నియమించాలని, రాష్ట్ర పర్యాటక శాఖ స్పందించి ప్యాలస్ను అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం ఎస్ఐ బలరాం బెహరాకు వినతిపత్రం అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని గుణుపూర్లో మంగళవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనకు సంబంఽధించి మృతి చెందిన వారు శిరిజొలి పంచాయతీ బొడొఅంబగుడ గ్రామానికి చెందిన తిరుపతి సొబొరొ (40), అతని మేనళ్లుడు ముండా సొబొరొ(18)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరిద్దరూ బైక్పై వెళ్తుండగా కొయిఠొపొదొరొ ప్రధాన రహదారి వద్ద ఆగి ఉన్న ఒక లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
రహదారి ఇలా.. రాకపోకలెలా?
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ నుంచి జిల్లా కేంద్రంలోని కొరాపుట్కు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గోతులు ఏర్పడటంతో రాకపోకలకు వాహనచోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొద్దిపాటి వర్షమొచ్చినా గోతుల్లో నీరు నిలిచిపోతుండటంతో ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ రహదారిలో 6 కిలోమీటర్లు తెలింగరి సాగునీటి ప్రాజెక్టు ఆధీనంలో ఉండగా, మిగతా భాగంగా రోడ్లు భవనాల విభాగం పరిధిలో ఉంది. నవరంగపూర్, బొరిగుమ్మ, కొట్పాడ్, ఛతీస్గఢ్ రాష్ట్రానికి జయపురం రాకుండా కొరాపుట్ వెళ్లేందుకు దగ్గరిదారి. అందుకే ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు.
జర్నలిస్టుపై దాడికి ఖండన
మల్కన్గిరి: బాలంగీర్ జిల్లాలో జర్నలిస్టుపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్కన్గిరి యూనియన్ జర్నలిస్ట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మల్కన్గిరి కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్కన్గిరి యూనియన్ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు దేబో ప్రసాద్దాస్ మాట్లాడుతూ జర్నలిస్టు కాళ్లు చేతులు కట్టేసి అమానుషంగా ప్రవర్తించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ దారుణ కాండను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
అదే విధంగా, జిల్లా ఉత్కళ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు అశోక్ మిశ్రో నేతృత్వంలో జర్నలిస్టులు సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంయూజీ ప్రతినిధులు ఎస్ఎన్ పండా, శివ ప్రసాద్ కీర్తనీయా, ఈశ్వర్ అద్ధంకి, జనీకి పట్నాయిక్, నీలు పాడీ, ఉత్కళ జర్నలిస్టు సంఘం సభ్యులు రత్నకార్ దాస్, నివాస్ పాత్రో, చరణ్ మహంతి, గౌరీ శంకర్ పండా, దిలీప్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు .

ఫార్వర్డ్ బ్లాక్ నేతల ఆందోళన