
అత్యవసరమైతే ఆస్పత్రికి రావొద్దు
రాయగడ: ‘అత్యవసర చికిత్స కోసం ఇక్కడకు రావొద్దు.. డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరతగా ఉన్నారు..’ అంటూ సదరు సమితిలోని జేకేపూర్ ఈఎస్ఐ ఆస్పత్రి గోడపై నిర్వాహకులు పోస్టర్ అతికించడం చర్చనీయాంశమైంది. పరిశ్రమల కార్మికులు ఎక్కువగా వినియోగించుకునే ఈ ఆస్పత్రిలో కొన్నాళ్లుగా సమస్యలు తాండవం చేస్తున్నాయి. ప్రస్తుతం డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరత కారణంగా దాదాపు ఈఎస్ఐ ఆస్పత్రి మూతపడే దిశకు చేరువవుతోంది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా రోగులు అత్యవసర చికిత్స సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం అంబులెన్స్ సేవలు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులపాలవుతున్నారు. ఇక రాత్రివేళ పూర్తిగా వైద్య సేవలను నిలిపివేసారు. ఈ ఆస్పత్రిపై ఆధారపడి సుమారు 14 వేల ఈఎస్ఐ కార్డు దారులు ఉన్నారు. 1978లో జేకేపూర్లో ఆస్పత్రి ప్రారంభించారు. 35 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రిలో 14 మంది డాక్టర్లకు గాను ప్రస్తుతం ముగ్గురే సేవలు అందిస్తున్నారు. మూడు పడకలే రోగులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికై నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆస్పత్రి సమస్యలపై దృష్టి సారించాలని లీఎస్ఐ కార్డుదారులు కోరుతున్నారు.
డాక్టర్లు, సిబ్బంది తగినంతగా లేరు
గోడపై పోస్టర్ అతికించిన జేకేపూర్ ఈఎస్ఐ ఆస్పత్రి నిర్వాహకులు

అత్యవసరమైతే ఆస్పత్రికి రావొద్దు