
కోవిడ్పై అపోహలు వద్దు
● రాష్ట్రంలో కేసుల పెరుగుదల లేదు ● అపోహలు ప్రసారం చేయవద్దు ● మీడియాకు ప్రజారోగ్య డైరెక్టర్ విజ్ఞప్తి
భువనేశ్వర్: రాష్ట్రంలో కొత్తగా ఐదుగురికి కరోనా సోకిందనే ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా బుధవారం స్పష్టం చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. కోవిడ్ కేసులలో అసాధారణ పెరుగుదల లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు. అపోహలు ప్రసారం చేయవద్దని ఈ సందర్భంగా ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇంత వరకు భారత ప్రభుత్వం ఎటువంటి కొత్త మార్గదర్శకాలను జారీ చేయలేదన్నారు. ప్రస్తుతం గుర్తించిన వేరియంట్ జేఎన్.1గా పేర్కొన్నారు. దీని పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జేఎన్–1తో గుర్తించబడిన రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు. త్వరలో డిశ్చార్జ్ చేస్తామన్నారు. కొత్త కేసులను ఆర్టి – పీసీఆర్ ద్వారా నిర్ధారిస్తామన్నారు. ప్రజలు, ముఖ్యంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, నివారణ చర్యలను అనుసరించడం కొనసాగించాలన్నారు. ప్రస్తుతం ఆరోగ్య వ్యవస్థ బాగా పనిచేస్తోందని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ నీలకంఠ మిశ్రా అభయమిచ్చారు.