
అక్రమంగా తరలిస్తున్న ఆవులుపట్టివేత
కొరాపుట్: కంటైనర్లలో భారీగా ఆవులను తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ నుంచి నాలుగు కంటైనర్లలో సుమారు 200 ఆవులు అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో కొరాపుట్ జిల్లా కేంద్ర పోలీసులు రాణీఘడ్ వద్ద ఈ కంటైనర్లని అడ్డగించి సోదాలను జరిపారు. అందులో దయనీయ స్థితిలో ఆవులు కనిపించాయి. వాటిలో నాలుగు ఆవులు ఎండ వేడిమికి మృతి చెందాయి. వెంటనే పోలీసులు ఆ కంటైనర్లని సీజ్ చేశారు. సమాచారం తెలియడంతో హిందూ పరివార్ సంస్థల సభ్యులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ ఆవులను జయపూర్ సమీపంలోని గొడపొదర్లో ఉన్న గోశాలకి తరలించారు. ఆవులను ఆంధ్రప్రదేశ్లోని మానాపురం తరలిస్తున్నట్లు నిందితులు పేర్కొన్నారు. అవి అక్కడి నుంచి కేరళ వెళ్తాయని పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో నలుగురు కంటైనర్ డ్రైవర్లని పోలీసులు అరెస్ట్ చేశారు.