
గోడకూలి మహిళ మృతి
భువనేశ్వర్: భద్రక్ జిల్లాలో గోడ కూలి మహిళ మృతి చెందింది. బాసుదేవ్పూర్ మున్సిపాలిటీ 3వ వార్డు మందారీ ప్రాంతంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా గోడ కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ బిష్ణుప్రియ మహంతిగా గుర్తించారు. స్థానిక తహసీల్దార్, మున్సిపల్ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కలప దుంగలు స్వాధీనం
రాయగడ: అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లాలోని ఉదయపూర్ గ్రామానికి చెందిన బి.విజయ్కుమార్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. గుణుపూర్ అటవీ శాఖ రేంజర్ గంగాధర్ మిశ్రో తెలిపిన వివరాల మేరకు.. గుణుపూర్ సమితిలోని జగన్నాథపురం నుంచి కలప దుంగలు అక్రమంగా రవాణా జరుగుతున్న సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బంది గొటొలొపొదొరొ వద్ద తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఒక పికప్ వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా అందులో విలువైన 29 కలప దుంగలు పట్టుబడ్డాయి. స్వాధీనం చేసుకున్న కలప దుంగల విలువ సుమారు రూ.లక్షకు పైబడి ఉంటుందని అంచనా వేశారు.
బాలికపై లైంగిక దాడి?
భువనేశ్వర్: పూరీలో నిత్యం రద్దీగా ఉండే బొడొదండొ మార్గంలో సోమవారం పశ్చిమ బెంగాల్కు చెందిన మైనర్ బాలికపై ఒక యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు భువనేశ్వర్కు చెందిన రంజిత్ సమంతరాయ్గా గుర్తించారు. తప్పించు కుని పారిపోతున్న నిందితుని స్థానికులు, ఒక హోంగార్డు పట్టుకున్నారు. నిందితుడిని స్థానిక సింహద్వారం పోలీసు ఠాణాకు తీసుకెళ్లే లోగా చావగొట్టారు. ఘటనపై నగర డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు.
గంజాయి స్వాధీనం
రాయగడ: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక యువకుడిని అబ్కారీ శాఖ, రైల్వేశాఖ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్టు చేశారు. అరైస్టెన వ్యక్తి జిల్లాలోని టికిరి గ్రామానికి చెందిన పంకజ్ మాఝిగా గుర్తించారు. గంజాయి అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు అబ్కారీ శాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం స్థానిక రైల్వేస్టేషన్లోని 5వ నంబర్ ప్లాట్ఫారంలో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా కనిపించే పంకజ్ బ్యాగులను తనిఖీ చేయగా అందులో 16.200 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని కోర్టుకు తరలించారు. రాయగడ నుంచి ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని రాయిపూర్కు గంజాయిని తరలించేందుకు నిందితుడు ఫ్లాట్ఫారంలో ఉండగా అబ్కారీ శాఖ ఐఐసీ బిజయ్ కుమార్ బెక్, ఎస్ఐ ఎ.నాయక్, ఏఎస్ఐ మానిక్ చంద్ర గౌడో, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ప్రమోద్ కుమార్ బొలా, రమేష్ కందపాని, డాగ్ స్వ్కాడ్ బీకే సింగ్ తదితరులు దాడులు నిర్వహించారు.

గోడకూలి మహిళ మృతి

గోడకూలి మహిళ మృతి