శ్రీ మందిరం పదజాలం చట్టబద్ధం: సీఏఓ | - | Sakshi
Sakshi News home page

శ్రీ మందిరం పదజాలం చట్టబద్ధం: సీఏఓ

May 27 2025 12:40 AM | Updated on May 27 2025 12:40 AM

శ్రీ

శ్రీ మందిరం పదజాలం చట్టబద్ధం: సీఏఓ

భువనేశ్వర్‌: ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథుని సంస్కృతి ప్రచార, ప్రసార సన్నాహాల్లో పొరపాట్లు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల పశ్చిమ బెంగాలు దిఘా ప్రాంతంలో కొత్తగా నిర్మితమైన శ్రీ జగన్నాథ ఆలయం నామకరణం పురస్కరించుకుని తలెత్తిన వివాదం నేపథ్యంలో శ్రీ మందిరం పాలక మండలి ఈ దిశలో తొలి అడుగు వేసింది. పాలక మండలి అధ్యక్షుడు పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్‌ దేవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాజా ప్రతిపాదన ప్రవేశ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీ మందిర్‌ నిఘంటువుకు చట్టబద్ధత కల్పించాలని ప్రతిపాదించారు. శ్రీ జగన్నాథుని సంస్కృతికి సంబంధించిన పదజాలం అన్యథా ప్రయోగించకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఈ మేరకు స్వామి కార్యకలాపాలకు సంబంధించిన పదాలకు పేటెంటు హక్కులు సాధించాలని ప్రతిపాదన ప్రవేశ పెట్టారు. శ్రీమందిర్‌, శ్రీ జగన్నాథ ధామ్‌, మహాప్రసాద్‌, శ్రీ జగన్నాథ దేవాలయం లోగో, శ్రీక్షేత్రం, పురుషోత్తం ధామ్‌ వంటి నిత్య, దైనందిన, ప్రత్యేక పద ప్రయోగాల క్రమబద్ధీకరణ కోసం పేటెంటు సాధించాలనే ప్రతిపాదనకు పాలక మండలి ఆమోదించిందని శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్‌ పాఢి తెలిపారు.

పొహండి క్రమబద్ధీకరణ

గత ఏడాది అడప మండపం పొహండి సమయంలో చోటు చేసుకున్న అసహజ సంఘటనపై త్రిసభ్య విచారణ కమిటీ నివేదిక దాఖలు చేసింది. ఈ నివేదికని పాలక మండలి సమావేశంలో ప్రవేశ పెట్టారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా కమిటీ చేసిన సిఫారసులు కార్యాచరణ కోసం విస్తృతంగా చర్చించడం జరిగిందని సీఏఓ వివరించారు. గత ఏడాది అడప మండపం పొహండి సందర్భంగా బలభద్ర స్వామి మూల విరాటు ఊహాతీతంగా నేలకొరిగి బోర్లా పడింది. ఈ సంఘటన అత్యంత అపచారంగా భావించిన భక్తజనం భావోద్వేగానికి గురైంది. దీనిపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ సమర్పించిన నివేదికని పాలక మండలిలో ప్రవేశ పెట్టారు. అనుభవజ్ఞులు, సీనియర్‌ దైతపతులు, అనుబంధ సేవకుల సమన్వయంతో పొహండి క్రమబద్ధీకరించడంపై సమావేశంలో చర్చించారు. ఈ మేరకు నిర్ధారిత కార్యాచరణ (ఎస్‌ఓపీ) రూపొందించనున్నారు. ఈ ఏడాది చారుమళ్ల తయారీలో సాధారణం కంటె మరికొంత పొడవైన తాటి మట్టలు వినియోగానికి యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అవసరమైన తాటి దూలాలు శ్రీ మందిరం ప్రాంగణానికి చేరాయి. చారుమళ్ల తయారీలో నైపుణ్యత పొందిన వర్గాల సంప్రదింపులు, దైతపతి, మహరణ, భొయి సేవకుల సహాయ సహకారాలు తీసుకుంటారు. ప్రథమ సోపానం నుంచి నీలాద్రి విజే వరకు పొహండి క్రమశిక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. సేవాయేతర వర్గాలు రథాలపైకి ఎక్కడం లేదా అనధికారిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతారు. గత ఏడాది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారి వ్యతిరేకంగా సాధారణ చర్యలతో చేతులు దులిపేసుకున్నారు. ఈ ఏడాది ఈ చర్యలు మరింత కఠినతరం కానున్నాయని హెచ్చరించారు. రథాలపై మొబైలు ఫోనులు వినియోగిస్తే తారసడితే సంబంధిత వ్యక్తుల వ్యతిరేకంగా క్రిమినల్‌ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడంతో మొబైలు ఫోను యథాతథంగా జప్తు చేయడం జరుగుతుందన్నారు.

ఒక్కో రథానికి పొహండి దళం

రథాలపైకి మూల విరాటుల తరలింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా ఒక్కో రథానికి ప్రత్యేకంగా పొహండి దళం ఏర్పాటు చేస్తున్నారు. ఈ దళంలో సభ్యుల పరిమితి, ఎంపిక, నియామకం బాధ్యతలు శ్రీ మందిరం పాలక వర్గానికి కేటాయించారు. శ్రీ మందిరం ఉపాధ్యక్షుడు, పూరీ జిల్లా కలెక్టరు, బాడొగ్రాహి, సేవాయత్‌ వర్గాల ప్రతినిథుల సంప్రదింపుల మేరకు పొహండి కార్యక్రమం విజయవంతం చేసేందుకు కార్యాచరణ ఖరారు చేస్తారు.

శ్రీ మందిరం పదజాలం చట్టబద్ధం: సీఏఓ 1
1/1

శ్రీ మందిరం పదజాలం చట్టబద్ధం: సీఏఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement