
జల క్రీడల సమయంలో పడవ బోల్తా
భువనేశ్వర్: పూరీ బీచ్లో ఆదివారం జల క్రీడల సందర్భంగా పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడింది. సముద్రంలో బోల్తా పడటంతో పడవ కింద పర్యాటకులు చిక్కుకున్నారు. అదృష్టవశాత్తూ స్థానిక లైఫ్గార్డ్లు తక్షణమే స్పందించి ఘోర విపత్తు నివారించారు. పర్యాటకులను బోల్తా పడిన పడవ నుంచి రక్షించారు. లైఫ్గార్డ్లు సకాలంలో చర్య తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనతో జల క్రీడల కార్యకలాపాల భద్రతా చర్యలపై సర్వత్రా భయాందోళనల వ్యక్తం అవుతున్నాయి.
పరుపుల కార్ఖానాలో
భారీ అగ్నిప్రమాదం
భువనేశ్వర్: స్థానిక మంచేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక పరుపుల కార్ఖానాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో లక్షలాది రూపాయల విలువైన పదార్థాలు దగ్ధమయ్యాయి. మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో లోపల నిల్వ చేసిన స్పాంజి, ప్లాస్టిక్, పత్తి, వస్త్రం వంటి పదార్థాలు దగ్ధమయ్యాయి. అగ్ని మాపక దళాలను మోహరించి మంటలు నివారించారు. అగ్నిప్రమాదానికి కారణం తెలియదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
జైలు ఆవరణలో ఖైదీ ఆత్మహత్య
భువనేశ్వర్: కటక్ చౌద్వార్ జైలు సముదాయంలో ఖైదీ ఆత్మహత్య సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంగణంలో మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.మృతుడు కటక్ జిల్లా సమంతరాపూర్ గ్రామస్తుడు విష్ణు ప్రసాద్ స్వంయిగా గుర్తించారు. విష్ణు ప్రసాద్ స్వంయిగా మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
● రూ. 40 వేల జరిమానా
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్ కురిగాం వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను జిల్లా మైనింగ్ అధికారి దిపెన్ పోరిడా పట్టుకుని పర్లాకిమిడి ఆదర్శ పోలీసుస్టేషన్కు అప్పగించారు. పట్టుబడిన ఇసుక టిప్పర్కు మైనింగ్ లైసెన్సు కాగితాలు లేకపోవడంతో రూ. 40 వేలు జరిమానా విధించారు. అనేకసార్లు ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు పట్టుబడుతున్నా వారిలో మార్పురావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కు రాత్రి వేళ ఇసుక రవాణా జరుగుతున్నట్టు జిల్లా మైనింగ్ అధికారులు చెబుతున్నారు. రోజూ వందలాది ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు ఒడిశాలోని వంశధార నది నుంచి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళానికి తరలిపోతున్నాయి.
పిడుగు పడి రెండు పశువులు మృతి
రాయగడ: పిడుగు పడి రెండు పశువులు మృతి చెందాయి. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి నారాయణపూర్ పంచాయతీలోని పొడేయికొన గ్రామంలో ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. పంట పొలాల్లో పశువులు పచ్చిక మేస్తున్న సమయంలో వర్షం కురిసింది. దీంతో రెండు పశువులు చెట్టు కిందకు వెళ్లాయి. అదే సమయంలో పిడుగు పడడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. నారాయణపూర్ గ్రామానికి చెందిన గంగన్న కరడ్రక , పొడేయికొన గ్రామానికి చెందిన రవీంద్ర కడ్రకలకు చెందిన రెండు పశువులుగా గుర్తించారు.

జల క్రీడల సమయంలో పడవ బోల్తా

జల క్రీడల సమయంలో పడవ బోల్తా