
గజపతి టాప్.. కొరాపుట్ లాస్ట్
● మెట్రిక్ పరీక్ష ఫలితాలు వెల్లడి
● సమగ్ర ఉత్తీర్ణత 94.93 శాతం
భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడించారు. ఈ ఏడాది ఫలితాల్లో 94.93 శాతం సమగ్ర ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలు రాసిన 5 లక్షల 2 వేల 417 మంది విద్యార్థుల్లో 4 లక్షల 84 వేల 863 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచారు. బాలికల ఉత్తీర్ణత 96 శాతం నమోదు కాగా బాలుర ఉత్తీర్ణత 94 శాతానికి పరిమితమైంది. అత్యధికంగా 99.35 శాతం ఉత్తీర్ణతతో గజపతి జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. అత్యల్పంగా 92.83 శాతం ఉత్తీర్ణతతో కొరాపుట్ జిల్లా అట్టడుగుకు దిగజారింది. రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద గోండ్ బోర్డు కార్యాలయం సందర్శించి ఫలితాల్ని ప్రకటించారు. ఆయనతో విభాగం ప్రముఖ కార్యదర్శి షాలిని పండిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫలితాల సంచికని ఆవిష్కరించారు.
సాయంత్రం 6 గంటల నుంచి ఫలితాలు bsodisha.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఓఆర్10 అని టైప్ చేసి 5676750 కు ఎస్ఎంఎస్ చేస్తే ఫలితాలు వివరాలు అందుతాయన్నారు. పరీక్ష ఫలితాల్లో 3,273 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. గత ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత రేటు 96.27 శాతం నమోదైంది.
ముఖ్యమంత్రి అభినందనలు
బోర్డు వార్షిక పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందించారు. ఆశాజనకమైన ఫలితాలు సాధించలేకపోయిన విద్యార్థులు దృఢ సంకల్పంతో సాధన చేసి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. విద్యార్థులంతా ఉజ్వల భవిష్యత్తో ఉన్నత ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.