ప్రజలందరికీ బాబు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

ప్రజలందరికీ బాబు వెన్నుపోటు

Oct 8 2025 8:07 AM | Updated on Oct 8 2025 8:07 AM

ప్రజలందరికీ బాబు వెన్నుపోటు

ప్రజలందరికీ బాబు వెన్నుపోటు

ప్రజలందరికీ బాబు వెన్నుపోటు

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని, దేశంలో ఎక్కడా లేని వింత వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 16 నెలలుగా నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 85 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 40 నుంచి 50 లక్షల మందికే అందజేశారని విమర్శించారు. లైసెన్సు ఉన్న డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం అందజేస్తానన్న చంద్రబాబు కేవలం ఆటోలు తోలే డ్రైవర్లకు అది కూడా కోత విధించడం దారుణమన్నారు. పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చి మాట తప్పారన్నారు. నకిలీ మద్యం సరఫరాతో చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో బూంబూం అంటూ విమర్శలు గుప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ బ్రాండ్‌తో పాటు సూపర్‌ సిక్స్‌ అనే బ్రాండ్‌ మద్యాన్ని కూడా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో నకిలీ మద్యం ప్లాంట్లు రెండు బయటపడడం, వీటి వెనుక టీడీపీ కీలక నేతలే ఉండడం, ఉత్తరాంధ్రలోనూ నకిలీ మద్యం ప్లాంట్లు ఉన్నాయని సమాచారం రావడంతో రాష్ట్రంలో మద్యం ప్రియుల వెన్నులో వణుకు పుడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తోందని ప్రజలకు అర్ధమైందన్నారు. నకిలీ మద్యం ఎలా తయారు చేయాలో కూటమి నాయకులకు ఆఫ్రికాలో శిక్షణ ఇచ్చి ఆ ఫార్ములా ద్వారా నకిలీ మద్యాన్ని ప్రభుత్వ పెద్దలే ఏరులై పారిస్తున్నారని విమర్శించారు.

మందు తాగొద్దు.. తస్మాత్‌ జాగ్రత్త

ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఒక కలుగు నాయుడుగా మిగిలిపోయారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అరవటం, రెచ్చిపోవటం, ఊగిపోవటం, తూగిపోవటం, జుట్టు పీక్కోవటం లాంటి చేష్టలు చేసిన ఆయన ఇప్పుడు మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడకుండా కలుగులోనే ఉంటున్నారని విమర్శించారు. సొంత అన్నయ్యను బాలకృష్ణ అగౌరవపరిచినా బయటకు రాకపోవడం దారుణమన్నారు. పవన్‌ కళ్యాణ్‌ నిజస్వరూపాన్ని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో జే బ్రాండ్‌ మద్యం అని వ్యాఖ్యానించిన కూటమి నాయకులు ప్రస్తుతం సీబీఎన్‌, పీకే, ఎల్‌కే బ్రాండ్లు తయారుచేసి వైన్‌ షాపులు, బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రతి మద్యం బాటిల్‌ను డిస్టిలరీల్లోనే తయారు చేశారని, ఇప్పుడు టీడీపీ నాయకుల ఇళ్లలోనే నకిలీ మద్యం తయారవుతోందని ధ్వజమెత్తారు. మందు బాబులు ఈ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తస్మాత్‌ జాగ్రత్త అని పేర్ని నాని హెచ్చరించారు. కూటమి సర్కారు పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు.

పవన్‌ ఓ కలుగు నాయుడు

ఎన్ని అరాచకాలు జరుగుతున్నా

బయటకు రావడం లేదు

రాష్ట్రంలో 16 నెలలుగా

ఏరులై పారుతున్న నకిలీ మద్యం

అవన్నీ సీబీఎన్‌, పీకే, ఎల్‌కే బ్రాండ్లే

వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement