
జలం.. పుష్కలం!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు అసాధారణంగా పెరిగాయి. ఆగస్టు వరకు 8.48 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టాలు సెప్టెంబర్ ముగిసే నాటికి సరాసరి 6.03 మీటర్లకు వచ్చాయి. ఒక్క నెలలోనే ఏకంగా 2.45 మీటర్ల వరకు పెరిగాయి. గతేడాది సెప్టెంబర్ (7.20 మీటర్లు)తో పోలిస్తే మెరుగైన పరిస్థితి. వర్షాకాలంలో ఇప్పటి వరకు 104 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదుకాగా, ఇందులో 70 శాతం వర్షాలు ఆగస్టు, సెప్టెంబర్లోనే కురిశాయి. వరదలు పోటెత్తి భూగర్భంలో ఊట భారీగా చేరింది. దీంతో జిల్లా అంతటా భూగ ర్భ జలాలు ఒక్కసారిగా పైకి వచ్చాయి. ఈ ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్ ముగిసే సరికి మొత్తంగా 6 మీటర్ల మేర పెరిగాయి. ఇది ఆరోగ్యకరమైన నీటిమట్టం కావడంతో వచ్చే ఏడాది వరకు బోరుబావులు, పంటలకు, సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాస్ బాబు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
85 శాతం విస్తరించిన భూగర్భ జలాలు
సెప్టెంబర్ మాసానికి సంబంధించిన భూగర్భ జలాల లెక్కలను ఇటీవల గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ తీసింది. జిల్లా వ్యాప్తంగా 82 ఫీజో మీటర్ల ద్వారా నీటి లెక్కలను సేకరించింది. ఇందులో 69 ఫీజో మీటర్లలో 10 మీటర్లలోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 11 ఫీజో మీటర్లలో 10–20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా రెండు ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే, జిల్లా వ్యాప్తంగా 85 శాతం వరకు భూగర్భ జలాలు పుష్కలంగా విస్తరించి ఉన్నాయి.
సెప్టెంబర్లో 2.45 మీటర్లు పెరిగిన భూగర్భ జలాలు
ప్రస్తుతం జిల్లాలో సరాసరి
నీటి మట్టం 6.03 మీటర్లు
భారీవర్షాలతో భూమి పొరల్లోకి
అసాధారణంగా చేరిన నీరు