
రిజర్వేషన్.. టెన్షన్..!
నిర్మల్: స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా.. ఉండవా..! అనే విషయం బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంది. ఈ తీర్పు ఎలావస్తుందో.. ఇవే రిజర్వేషన్లు ఉంటాయా.. లేక మారుతాయా..! అనే టెన్షన్ ఆశావహుల్లో నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తీర్పు ఎలావచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న వాదన అధికార పార్టీ వర్గాల్లో ఉంది. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు చేపడితే.. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులు ఎలా ఉంటాయోనని ఆశావహుల్లో ఆందోళన కనిపిస్తోంది.
8న హైకోర్టు తీర్పు?
ఈనెల 9న రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేసేస్తోంది. కానీ.. అంతకు ఒక్కరోజు ముందు అంటే బుధవా రం హైకోర్టులో ఎన్నికల భవితవ్యం తేలిపోనుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లడంపై వేసిన కేసు కు సంబంధించిన తీర్పు ఈనెల 8న రానుంది. చట్ట బద్ధత లేని రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు అనుమ తి ఉండకపోవచ్చన్న వాదన బలంగా ఉంది. మరో వైపు మరో అవకాశం ఏదైనా ఇవ్వొచ్చు.. అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేనిపక్షంలో పాతరిజర్వేషన్ల కోటా ప్రకారమైనా ఎన్నికలను కొనసాగించవచ్చని అధికార పార్టీవర్గాలే వెల్లడిస్తున్నాయి.
ఆశావహుల్లో ఆందోళన..
ఇటీవల ప్రకటించిన షెడ్యూల్, అధికారులు వెల్ల డించిన రిజర్వేషన్ల ప్రకారం చాలామంది ఆశావహులు ఇప్పటికే మానసికంగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. కానీ.. బుధవారం కోర్టు తీర్పు ఎలా ఉంటుంది, దానిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎన్నికలతోపాటు ప్రకటించిన రిజర్వేషన్లలోనూ మార్పులు ఉంటాయా.. అన్న టెన్షన్ చాలామందిలో కనిపిస్తోంది. ప్రస్తుతం పోటీకి అవకాశం ఉన్న ఆశావహులతోపాటు రిజర్వేషన్ కారణంగా పోటీకి దూరమవుతున్న నేతలూ ‘8న ఏమొస్తుందో చూద్దాం..’అంటూ ఆసక్తిగా వేచిచూస్తున్నారు.
బడుగులకు పీఠం..!
నిర్మల్ 2016లో జిల్లాగా ఏర్పడింది. ఆతర్వాత 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. తొలిసారి జిల్లాలో జరిగిన ఎన్నికల్లో జెడ్పీచైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. ఈమేరకు అప్పుడు బీఆర్ఎస్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొరిపెల్లి విజయలక్ష్మి నిర్మల్రూరల్ జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈసారి ప్రకటించిన రిజర్వేషన్లలో జెడ్పీచైర్మన్ స్థానం బీసీ జనరల్కు వచ్చింది. బడుగుల జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలో తొలిసారి వెనుకబడిన కులాలకు చైర్మన్ స్థానం దక్కనుంది. ఈమేరకు బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు సీనియర్, జూనియర్ నేతలు తాము చైర్మన్ బరిలో ఉండాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలూ చేస్తున్నారు.