భీం త్యాగానికి గౌరవం | - | Sakshi
Sakshi News home page

భీం త్యాగానికి గౌరవం

Oct 7 2025 5:16 AM | Updated on Oct 7 2025 5:16 AM

భీం త్యాగానికి గౌరవం

భీం త్యాగానికి గౌరవం

వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం జోడేఘాట్‌లో నేడు కార్యక్రమాలు.. ముస్తాబైన వీరుడి పోరుగడ్డ హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు

కెరమెరి(ఆసిఫాబాద్‌): నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలర్పించిన భీం త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జల్‌.. జంగల్‌.. జమీన్‌.. నినాదంతో పోరాడి అమరుడైన కుమురంభీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెరమెరి మండలం జోడేఘాట్‌లో మంగళవారం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు సమాధి వద్ద పూజలు చేసి, 10 గంటలకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఏర్పాట్లు పరిశీలించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.

పదివేల మందికి పైగా హాజరు..

ప్రభుత్వం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంతో అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే భీం విగ్రహానికి మెరుగులు దిద్దారు. ట్రాక్టర్లతో పరిసరాలు, పార్కింగ్‌ స్థలాలు చదును చేయించి.. ప్రజలు కూర్చునేందుకు వీలుగా టెంట్లు వేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. 10వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తుండగా, 12 వేల మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. హెలిప్యాడ్‌ సైతం సిద్ధం చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీతోపాటు సీఐ, ఆర్‌ఐలు 8 మంది, ఎస్సైలు 25, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు 51 మంది, ఇతర సిబ్బంది 136, డబ్ల్యూపీసీలు 56, హోంగార్డులు 79 మంది, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌తో జోడేఘాట్‌కు చేరుకునే రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఏటీడబ్ల్యూవోలు ముగ్గురు, సీఆర్‌టీలు, రెగ్యులర్‌ ఉపాధ్యాయులు 100 మంది, వంట మనుషులు 70 మంది, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు ఐదుగురు, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించారు. ఐకేపీ సిబ్బంది 35 మంది, ఇంజినీరింగ్‌ శాఖకు చెందిన సిబ్బంది పది మందిని కేటాయించారు. ఆయా శాఖల సిబ్బంది సోమవారం రాత్రే జోడేఘాట్‌కు చేరుకున్నారు. ఆసిఫాబాద్‌ డిపో నుంచి ప్రత్యేక బస్సులను జోడేఘాట్‌కు నడపనున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్‌ స్థలాలు సిద్ధం చేశారు.

హాజరు కానున్న మంత్రులు,

ప్రజాప్రతినిధులు

రాష్ట్ర ప్రభుత్వం భీం వర్ధంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూ రి లక్ష్మణ్‌, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి హాజరు కానున్నారు. అలాగే ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కేవలం భీం విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, పూజలకే పరిమితం కానున్నారు. ఆదివాసీలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు ఏటా నిర్వహించే దర్బారు కోడ్‌ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement