
● శిల్పాలతో ఉపాధి పొందుతున్న సాయిశ్యాం ● శిల్పకళాధామం ఏ
శిల్పాలు చెక్కుతున్న సాయిశ్యాం
కుభీర్: మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. అన్నాడు ఓ సినీ కవి. ఆ పదాలను గట్టిగా పట్టుకున్న కుభీర్కుచెందిన యువకుడు తన పూర్వీకుల నుంచి వస్తున్న కళను నమ్ముకున్నాడు. ఆదరణ లేని వృత్తే అయినా.. దానిని సరికొత్తగా ఆవిష్కరించాలనుకున్డాను. ఆధునిక విధానంలో పాత కళకు ప్రా ణం పోస్తున్నాడు. తాను ఉపాధి పొందుతూ మరో ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. కుభీర్లో శిల్పకళకు ఆధునిక రూపం ఇస్తూ, కళాకారుడు సాయిశ్యాం. విశ్వకర్మ శిల్పకళాధామాన్ని స్థాపించి, తనకు ఉపాధి సమకూర్చుకోవడమే కాక, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు. ఈ కళాధామంలో ప్రస్తుతం ఐదుగురు యువకులు పనిచేస్తుండగా, అవసరాన్ని బట్టి మరికొందరిని కూడా నియమించుకుంటున్నారు.
కళాకారుల వంశం
సాయిశ్యాం కుటుంబం మొత్తం కళాకారులతో నిండి ఉంది. ఆయన తాత వడ్ల పెద్దన్న కట్టెతో విగ్రహా లు తయారు చేయడంతోపాటు జానపద గురుభో ద పాటలు రాసేవారు, పాటలు పాడేవారు. తండ్రి శంఖర్ సిమెంట్, మట్టితో విగ్రహాలు తయారు చే స్తారు. తమ్ముడు నరేశ్ విగ్రహాల తయారీలో సాయిశ్యాంకు సహకరిస్తూ, నైపుణ్యం కలిగిన పెయింటర్గా కూడా పనిచేస్తున్నాడు. సాయిశ్యాం ఇంటర్మీడియట్, డ్రాయింగ్లో టీచర్ ట్రైనింగ్ కోర్సు(టీటీసీ) పూర్తి చేసి, ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా క్రాఫ్ట్, డ్రాయింగ్ బోధిస్తూ, మిగి లిన సమయంలో కళాధామంలో పనిచేస్తున్నారు.
విగ్రహాల తయారీలో నైపుణ్యం
సాయిశ్యాం నల్లరాయి, కృష్ణశిల, ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ), సిమెంట్, సుద్దమట్టితో రకరకాల విగ్రహాలు తయారు చేస్తారు. లక్ష్మీ, సరస్వతి, గణపతి, కృష్ణుడు, శంకరుడు, ఎల్లమ్మ, పోచమ్మ వంటి దేవీదేవతల విగ్రహాలతోపాటు, శివాజీ, వివేకానంద, గాంధీజీ, అంబేద్కర్ వంటి దేశ నాయకుల, మహాత్ముల విగ్రహాలను కూడా నైపుణ్యంతో రూపొందిస్తారు. ఆర్డర్, అడ్వాన్స్ ఆధారంగా విగ్రహాలు తయారు చేసి ఇస్తారు. ఇక్కడి నుంచి నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రలోని గ్రామాలకు విగ్రహాలు పంపిస్తాడు. కళాధామంలో పనిచేసే కార్మికులకు జీతాలు, ఇతర ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఖర్చవుతాయని సాయిశ్యాం తెలిపారు.
అవార్డులు, గుర్తింపు
సాయిశ్యాం కళాప్రతిభకుగాను అనేక అవార్డులు అందుకున్నారు. 2013లో హైదరాబాద్లో ట్రూ ఇండియన్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి హోం మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా అవార్డు పొందారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం, 2018 లో గోల్కొండ క్రాఫ్ట్స్ సంస్థ నుంచి అవార్డులు అందుకున్నారు. 2025 జనవరి 26న కలెక్టర్ అభిలాష చేతుల మీదుగా ప్రశంసా పత్రం పొందారు.
భవిష్యత్ ఆకాంక్షలు
2015లో స్థాపించిన విశ్వకర్మ శిల్పకళాధామం ద్వారా సాయిశ్యాం అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని, సహాయం అందితే మరింత మందికి శిల్పకళ నేర్పించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని సాయిశ్యాం తెలిపారు.