
ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయులు
కర్నూలు: కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామంలో రెడ్డిపోగు వెంకటేశ్వర్లు (55) దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. ఆమె చనిపోవడంతో రెండవ భార్య రెడ్డిపోగు సువేదమ్మను వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఒక కూతురు సంతానం. రెండో వివాహం చేసుకున్న తర్వాత మొదటి భార్య పిల్లలకు ఆస్తి పంపకాలు చేశాడు. అయితే కొంతకాలం క్రితం మరో 2.20 ఎకరాలు కొనుగోలు చేశాడు. అందులో కూడా తమకు వాటా ఇవ్వాలంటూ మొదటి భార్య పిల్లలతో కొంతకాలంగా గొడవ జరుగుతోంది. పలుమార్లు ఆస్తి కోసం తగాదా జరిగినప్పటికీ వెంకటేశ్వర్లు వాటా ఇవ్వలేనని తేల్చిచెప్పాడు. దీంతో మంగళవారం ఉదయం వెంకటేశ్వర్లు పొలంలో ఉండగా మొదటి భార్య పిల్లలు కృష్ణ, స్వాములు, చిన్నస్వాములు, లక్ష్మి, రేణుక, చిన్న రేణుకతో పాటు మరో పది మంది కుటుంబ సభ్యులు అతని కంట్లో కారం కొట్టి ఇనుపరాడ్లు, కట్టెలతో బాదడంతో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. రెండో భార్య సువేదమ్మ వచ్చి ఆయన్ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించిన గంటలోపే మృతిచెందాడు. సువేదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదటి భార్య కుమారులు, కుమార్తెలతో పాటు మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు అర్బన్ తాలూకా సీఐ శ్రీధర్ తెలిపారు.