
లక్ష్యాన్ని మించి కొనుగోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాసంగిలో ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం వెల్లువలా వచ్చింది. ప్రభుత్వం ఈ సీజన్లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 5.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమైన యాసంగి కొనుగోళ్లు డిండి మండలం మినహా జిల్లా వ్యాప్తంగా అంతటా ముగిసాయి. డిండి మండలంలో కోతలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడ ఆరు కేంద్రాలు తెరిచి ఉన్నాయి. బుధవారంతో అక్కడ కూడా కొనుగోళ్లు పూర్తికానున్నాయి.
జిల్లాలోనే మొదట ప్రారంభం
నల్లగొండ జిల్లాలో వరి కోతలు మార్చి రెండో వారంలోనే ప్రారంభం కావడంతో ధాన్యం అప్పటికే పెద్ద ఎత్తున కేంద్రాలకు వచ్చింది. దీంతో మార్చి 24వ తేదీన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాష్ట్రంలోనే మొదటి కొనుగోలు కేంద్రాన్ని నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి, ఆ తర్వాత తిప్పర్తిలో ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లా 2వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 5.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే 5.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా 600 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. అంటే దాదాపు జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
రైతులకు వేగంగా చెల్లింపులు
యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 375 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలో ఇప్పటివరకు 5.97 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో సన్నాలు 20,772 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 5,76,228 మెట్రిక్ టన్నులు ఉంది. మొత్తం 84,619 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. వాటి విలువ రూ.1,375 కోట్లు కాగా ఇప్పటి వరకు రైతులకు రూ.1,296 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
369 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి
జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు 369 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. దేవరకొండ నియోజకవర్గంలో డిండి మండలంలో ఆరు కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో దాదాపు 600 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. అక్కడ మిగిలిన ధాన్యాన్ని బుధవారం కొనుగోలు చేసి ఆయా కేంద్రాలను కూడా మూసివేయనున్నారు.
ధాన్యం కొనుగోళ్ల వివరాలు ఇలా..
కేంద్రాలు 375
కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం 5.97 లక్షల మెట్రిక్ టన్నులు
సన్నాలు 20,772 మెట్రిక్ టన్నులు
దొడ్డు రకం 5,76,228 మెట్రిక్ టన్నులు
ధాన్యం అమ్మిన రైతులు 84,619 మంది
కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.1,375 కోట్లు
రైతులకు చెల్లించినది రూ.1,296 కోట్లు
బోనస్ చెల్లింపు ఆలస్యం
ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో యాసంగి సీజన్లో 20,772 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేశారు. ఆయా రైతులకు ప్రస్తుతం మద్దతు ధర మాత్రమే జమవుతోంది. బోసన్ ఆగస్టు మాసంలో జమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ప్రభుత్వ కేంద్రాలకు వెల్లువలా వచ్చిన ధాన్యం
ఫ లక్ష్యం 5.50 లక్షల మెట్రిక్ టన్నులు.. కొన్నది 5.97 లక్షల మెట్రిక్ టన్నులు
ఫ రైతులకు వెంటనే చెల్లింపులు
ఫ సన్నాల బోనస్ మాత్రం ఆలస్యం
ఫ నేటితో ముగియనున్న యాసంగి ధాన్యం కొనుగోళ్లు
కొనుగోళ్లు సజావుగా సాగాయి
కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ల సూచనలతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాయి. ఆరు కేంద్రాలు మినహా అన్ని గ్రామాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఇంకా 600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంది. బుధవారంతో ధాన్ని కూడా కొనుగోలు చేస్తాం. ఈసారి లక్ష్యాన్ని మించి ధాన్యం కొనుగోలు చేశాం.
– హరీష్, డీఎం పౌర సరఫరాల శాఖ

లక్ష్యాన్ని మించి కొనుగోలు