
శిథిలం.. ప్రమాదకరం!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రెండస్తుల భవనం బోయపల్లిలోని బీసీ కాలనీలో ఉంటుంది. దీనిని దాదాపు 75 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో 12 ఏళ్ల క్రితం దీని యజమాని మరో ప్రాంతానికి వెళ్లి నివాసముంటున్నారు. అయితే పాత ఇల్లును పూర్తిగా కూల్చివేయకపోవడంతో అందులో పాములు, విష క్రిమి కీటకాలు సంచరిస్తుండటంతో చుట్టుపక్కల వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి సంబంధిత యజమానికి నోటీసులు ఇచ్చి కూల్చి వేసి చదును చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ఫొటోలలో కనిపిస్తున్న పాత ఇళ్లు మదీనా మసీదు నుంచి కొత్త రైల్వేగేట్ వైపు వెళ్లే దారిలో ఉన్నాయి. పదేళ్ల క్రితం ఇవి శిథిలావస్థకు చేరుకోగా తాళాలు వేసి యజమానులు వేరే చోటకు వెళ్లిపోయారు. వీటిని పూర్తిగా తొలగించకపోవడంతో ఈ మార్గం గుండా వెళ్తున్న పాదచారులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవి ఎప్పుడు పడిపోయి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు భయం భయం మధ్యన రాకపోకలు సాగిస్తున్నారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో వందలాది పాత ఇళ్లు కూలిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా వర్షాకాలంలో మాత్రం వీటి యజమానులకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకొంటున్నారు. వీటిలో కొందరు స్వచ్ఛందంగా తొలగించుకుని తాజాగా ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. మరికొందరు వాటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు.
● ఈ సీజన్లో మొత్తం 60 డివిజన్ల పరిధిలో 89 మాత్రమే పాత ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా వీరన్నపేటలో 10, హనుమాన్ నగర్–కొత్తగంజి, పాతతోట, ఎదిర, అప్పన్నపల్లిలో ఎనిమిది చొప్పున కూలిపోయే దశలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే టీడీగుట్ట, పాల్కొండ లో ఏడు చొప్పున, బోయపల్లి, తిమ్మసానిపల్లి, అస్లాంఖాన్ వీధిలో నాలుగు చొప్పున, పాన్చౌరస్తాలో మూడు, కిద్వాయిపేట, కల్వరికొండ, రాజేంద్రనగర్–సద్దలగుండు, మెట్టుగడ్డలో రెండు చొప్పున పాత ఇళ్లు ఉన్నాయి. ఇక ఏనుగొండలోని ఎస్సీ కాలనీ, గణేష్నగర్, లక్ష్మీనగర్, వివేకానందనగర్, వల్లభ్నగర్, శేషాద్రినగర్, బీకేరెడ్డి కాలనీ, నూర్నగర్, కుమ్మరివాడిలో ఒక్కొక్కటి శిథిలావస్థకు చేరుకున్నాయని నిర్ధారించారు. అలాగే గతేడాది సుమారు 200 ఇళ్లు పడిపోయే దశలో ఉన్నట్లు గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేశారు. అంతేగాని వాటిని పూర్తిగా తొలగించుకోవాలని ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో చాలా మంది వాటికి తాళాలు వేసి వేరే చోటకు వెళ్లి అద్దె ఇళ్లలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు.
పదేళ్లు దాటినా..
నగర పరిధిలోని 12 విలీన గ్రామాల్లో వందలాది పాత ఇళ్లు పదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని అప్పట్లోనే వదిలేసిన యజమానులు వేరే ప్రాంతాల్లో నివాసముంటున్నారు. అయితే ఈ ఇళ్లను మాత్రం పూర్తిగా కూల్చేయకపోవడంతో చుట్టూ ఏపుగా ముళ్లకంప చెట్లతో మొత్తం చీదుపొదలు అలుముకున్నాయి. ఇవి విషసర్పాలకు ఆవాసంగా మారాయని చుట్టుపక్కల వారు వాపోతున్నారు. ఇప్పటికై నా బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాం..
నగర పరిధిలో ఈ వానాకాలం సీజన్లో శిథిలావస్థకు చేరుకున్న 89 ఇళ్లను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు అందజేశాం. ఇటీవలి భారీ వర్షాలకు పలుచోట్ల పాత ఇళ్లు కూలిపోయినట్లు మా దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయిలో మా సిబ్బందిని పంపించి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా అన్ని చర్యలు తీసుకున్నాం. అలాగే పదేళ్ల క్రితమే పడిపోయిన ఇళ్ల యజమానులకు సైతం నోటీసులు ఇచ్చి వెంటనే పూర్తిగా తొలగించుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తాం. – టి.ప్రవీణ్కుమార్రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్
నగర పరిధిలో కూలిపోతున్న వందలాది పాత ఇళ్లు
నోటీసులిచ్చి చేతులు దులుపుకొంటున్న మున్సిపల్ అధికారులు
తాళాలు వేసి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లిన బాధితులు
పాత ఇళ్లు అలాగే వదిలేయడంతో.. పొంచి ఉన్న ప్రమాదం

శిథిలం.. ప్రమాదకరం!

శిథిలం.. ప్రమాదకరం!

శిథిలం.. ప్రమాదకరం!

శిథిలం.. ప్రమాదకరం!

శిథిలం.. ప్రమాదకరం!