
పాలమూరుకు క్రీడాకళ
● నేటినుంచి సీనియర్ పురుషుల ఫుట్బాల్ పోటీలు
● నాలుగు రోజులపాటు మెయిన్
స్టేడియంలో నిర్వహణ
● 240 మంది క్రీడాకారులు,
40 మంది అఫీషియల్స్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ పోటీలకు వేదిక కానుంది. మెయిన్ స్టేడియంలో గురువారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు ఫుట్బాల్ పోటీలు జరగనున్నాయి. జిల్లాలో మూడోసారి రాష్ట్రస్థాయి సీనియర్ ఫుట్బాల్ పోటీలు నిర్వహించనున్నారు.
టోర్నీలో పాల్గొననున్న 12 జట్లు
రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ చాంపియన్ షిప్లో ఉమ్మడి జిల్లాలైన మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ జట్లతోపాటు వనపర్తి, జోగుళాంబ గద్వాల, సిద్దిపేట జట్లు పాల్గొంటున్నాయి. 240మంది క్రీడాకారులు, 24మంది కోచ్, మేనేజర్లు, 10 మంది టెక్నికల్ అఫీషియల్స్ హాజరవుతున్నారు. టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు లిటిల్ స్కాలర్స్, రెయిన్ బో, మాడ్రన్ స్కూల్లో వసతి, మెయిన్ స్టేడియంలో భోజన సౌకర్యం కల్పించనున్నారు.
లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు
ఫుట్బాల్ టోర్నీలో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్లు నిర్వహించనున్నారు. టోర్నీలో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్–ఏలో వనపర్తి, నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రూప్–బిలో మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్, గ్రూప్–సిలో సిద్దిపేట, నల్గొండ, రంగారెడ్డి, గ్రూప్–డిలో గద్వాల, మెదక్, వరంగల్ జట్లు ఉన్నాయి. నేడు ఉదయం 11గంటలకు స్టేడియంలో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్బాల్ చాంపియన్ షిప్ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 28న సాయంత్రం 3గంటలకు జరిగే ముగింపు వేడుకల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.
టోర్నమెంట్ ఏర్పాట్ల పరిశీలన
మెయిన్ స్టేడియంలో జరిగే ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్ తదితరులు పరిశీలించారు. అదేవిధంగా జిల్లా జట్టుకు క్రీడాదుస్తులు అందజేశారు. కార్యక్రమంలో సభ్యులు గజానంద్కుమార్, సూర్యప్రకాశ్, ఇమాన్యుయెల్ జేమ్స్, రామేశ్వర్, నగేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.
ఫుట్బాల్ పురుషుల జిల్లా జట్టు
అరుణ్, నికేశ్, దినేశ్, రాములు, కృష్ణ, శ్రీకాంత్, ప్రకాశ్, నరేష్, స్నేహిత్, సాయికృష్ణ, సామెలు, కల్యాణ్, జహంగీర్, శివప్రసాద్, సూర్యప్రకాశ్, ఆర్య, హిమకిరణ్, సమీర్ బిన్ మహ్మద్ సిద్దిఖ్, లక్ష్మణ్గౌడ్, ప్రేమ్కుమార్, కోచ్ మీర్ వాజిద్ అలీ, మేనేజర్ రాజేందర్.