
జూరాలకు 3.32 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● ప్రాజెక్టు 45 క్రస్టుగేట్ల ఎత్తివేత
● జల విద్యుత్ కేంద్రంలో
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
● 3.42 లక్షల క్యూసెక్కుల
నీరు దిగువకు..
ధరూరు/ఆత్మకూర్: కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. సోమవారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 2.82 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 8 గంటలకు 3.32 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 45 క్రస్టు గేట్లు ఎత్తి 3.14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 25,676 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 69 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 580 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 3.42 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9. 657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.651 టీఎంసీల నీ రు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు వెల్లడించారు.
ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి
ప్రాజెక్టులోని 6 యూనిట్ల ద్వారా 6 యూనిట్ల ద్వారా 358.673 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 729.535 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశామని పేర్కొన్నారు. జూరాలకు వరద ప్రవాహం పెరగడంతో దిగువ ఉత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టలేదన్నారు.
రెండు గేట్లు తెరిచి..
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి రెండు గే ట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. సోమ వారం 6 గేట్లను తెరిచి నీటిని విడుదల చేయగా.. మంగళవారం ఎగువ నుంచి వచ్చే ఇన్ఫ్లో తగ్గడంతో నాలుగు గేట్లను మూసి 2 గేట్లను రెండు అడుగు ల మేర పైకెత్తి 1,400 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. పెద్దవాగు ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని గేట్ల ను తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సుంకేసులకు స్వల్పంగా..
రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 21,350 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. నాలుగు గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 17,916 క్యూసెక్కులు, కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేందర్ పేర్కొన్నారు.