
మళ్లీ పోటెత్తిన వరద
ధరూరు: కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుందని పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 8గంటల వరకు ప్రాజెక్టుకు 2లక్షల 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సోమవారం రాత్రి 8గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లోలు 2లక్షల 82వేల క్యూసెక్కులకు పెరిగినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు 37గేట్లను ఎత్తి 2. 56లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జల విద్యు త్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 29, 075 క్యూసెక్కులు, నెట్టెపాడుకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వవకు 560 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2, 89, 434 క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తు తం ప్రాజెక్టులో 8.551 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 32.98 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 80వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 15గేట్లను ఎత్తి దిగువనున్న జూరాలకు 75, 600 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
726.371 ఎంయూల విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు సోమవారం 6 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 355.509 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 726.371 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. జూరాలకు అత్యధికంగా వరద చేరుతుండడంతో దిగువ ఉత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టలేక పోయామని వివరించారు.
జూరాల ప్రాజెక్టు 37గేట్ల ద్వారా
దిగువకు నీటివిడుదల
ఇన్ఫ్లో 2.82 లక్షలు, అవుట్ ఫ్లో 2.89లక్షల క్యూసెక్కులు
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి