వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో రెండు రోజులపాటు నిర్వహించిన అంతర్ జిల్లాల ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం సాయంత్రం ముగిసింది. ముగింపు వేడుకలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యవంతమైన జీవన విధానానికి దిక్సూచి అన్నారు. అండర్–35 విభాగంలో ఖమ్మం జిల్లా లాలా, స్వప్నిల్ జోడి అత్యంత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. రన్నరప్గా కొత్తగూడెం జిల్లాకు చెందిన సతీశ్, కృష్ణారావు జోడీ నిలిచింది. 35 ప్లస్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సతీశ్, కబీర్ జోడి విజేతగా నిలిచి ట్రోఫీని అందుకోగా, ఖమ్మం జిల్లా జోడీ హర్ష, వెంకటేశ్వర్లు రన్నరప్గా నిలిచారు. వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో డబ్ల్యూడీటీఏ కార్యదర్శి ఎన్.మనోహర్రెడ్డి, అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు ఏవీ ఎలమురుగు, తోకల బాపురెడ్డి, ఖజాంచి, డాక్టర్ పోకుల ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి కన్నారెడ్డి, మీడియా ఇన్చార్జ్ డాక్టర్ జయంసింహారెడ్డి, సభ్యులు డాక్టర్ ఎం. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
రామనరసింహారావుపై సస్పెన్షన్ వేటు
కాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్– 1 సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తూ ఈనెల 2వ తేదీన ఏసీబీ విచారణ ఎదుర్కొన్న రామనరసింహారావును రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శని,ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సస్పెన్షన్ ఉత్తర్వుల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాయింట్–2 ఆనంద్ను డీఐజీ సుభాషిణి ఈనెల 4వ తేదీన ఏసీబీ అధికారుల నివేదిక ఆధారంగా సస్పెండ్ చేయగా, వారం రోజుల తర్వాత ఐజీ జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రామనరసింహారావును సస్పెండ్ చేశారు.


