
రైస్ మిల్లర్లు లక్ష్యాలు పూర్తి చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాలతో కలిసి జిల్లా పౌరసరఫరాలు, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ ప్ర తినిధులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సన్న, దొడ్డు రకం వడ్లు 56,588 మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చన్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించా రు. లక్ష్యాలు పూర్తిచేయని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుని, మిల్లులు సీజ్ చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, మాయిశ్చర్ డ్రయర్ సదుపాయాలు కల్పించాలని, తేమశాతంపై అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం తరలింపునకు 46 వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపా రు. పక్క రాష్ట్రం నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా వెంకట్రావ్ పేట, గూడెం, సిర్పూర్(టి)లో అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాల విక్రయం, రవాణా, వినియోగంపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టం– 2025 ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో మంగళవారం భూభారతి చట్టంపై అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందులో అప్పీలు వ్యవస్థ కీలకమన్నారు. తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులతో రైతుకు న్యాయం జరగకపోతే ఆర్డీవో, సబ్ కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చని, అక్కడా న్యాయం జరగని పక్షంలో కలెక్టర్ ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. విరాసత్ సమయంలో కుటుంబ సభ్యులందరికీ నోటీసులు జారీ చేస్తారన్నారు. జూన్ 2 తర్వాత ప్రతీ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ రోహిత్, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.