
ఆర్టీసీకి దసరా బొనాంజా!
ఆర్టీసీపై నమ్మకానికి నిదర్శనం
● ఖమ్మం రీజియన్కు రూ.24.22 కోట్ల ఆదాయం ● 6వ తేదీన అత్యధికంగా రూ.2.18 కోట్ల రాబడి ● అవిశ్రాంతంగా పనిచేసిన డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది
ఖమ్మంమయూరిసెంటర్: దసరా పండుగ ఆర్టీసీ ఖమ్మం రీజియన్కు కనకవర్షం కురిపించింది. పండుగ రద్దీ ఆధారంగా ఆర్ఎం సరిరామ్ ఆధ్వర్యాన ముందస్తు ప్రణాళికలు రూపొందించడమే కాక సిబ్బంది నిర్విరామంగా పనిచేయడంతో రాకపోకలు సాఫీగా సాగాయి. ఫలితంగా రీజియన్కు రూ.24,22,58,199 ఆదాయం లభించింది.
1,208 ప్రత్యేక బస్సులు..
బతుకమ్మ, దసరా పండుగలకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ప్రజలు స్వస్థలాలకు రానున్నందున ముందుగానే డిపో మేనేజర్లు, సూపర్వైజర్లతో ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరాం పలు దఫాలు సమీక్షించారు. ఈమేరకు ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతనెల 20 నుంచి ఈనెల 6వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్కు బస్సులు నడిపారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందుకు, ఇక్కడి నుంచి హైదరాబాద్కు వేలాది మందిని చేర్చేలా 1,208 ప్రత్యేక సర్వీసులు రాకపోకలు సాగించాయి.
38.50లక్షల కి.మీ. ప్రయాణం
గత నెల 20వ తేదీ నుంచి ఈనెల 6వరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం రీజియన్కు, ఇక్కడి నుంచి హైదరాబాద్కు 38.50 లక్షల కి.మీ. బస్సులు తిరిగాయి. దీంతో ఆర్టీసీ రీజియన్కు మహాలక్ష్మితో కలిపి రూ.24.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.4.15 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. కాగా, బతుకమ్మ, దసరా పండుగకు వచ్చివెళ్లే ప్రయాణికులకు సేవలందించేలా రీజియన్లోని ఏడు డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, కార్మికులు, సూపర్వైజర్లు, డిపో మేనేజర్లు అవిశ్రాంతంగా పనిచేయడంతో ఎక్కడా లోటుపాట్లు ఎదురుకాలేదు.
ఒకేరోజు 3.17 లక్షల కిలోమీటర్లు
ఈ దసరా సెలవుల్లో ఖమ్మం రీజియన్ అధికారులు గత రికార్డులను బ్రేక్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 6వ తేదీ సోమవారం ఒకేరోజు 3.17 లక్షల కి.మీ. మేర బస్సులు తిరగగా రూ.2.18 కోట్ల ఆదాయం రాబట్టారు. ఇందులో రీజియన్లోని ఖమ్మం డిపోకు అత్యధికంగా రూ.49 లక్షలు ఆదాయం రాగా, భద్రాచలానికి రూ.38.39 లక్షలు, సత్తుపల్లికి రూ.37.95లక్షలు, మధిరకు రూ.32 లక్షలు, మణుగూరుకు రూ.21.50 లక్షలు, కొత్తగూడెంకు రూ.21.50 లక్షలు, ఇల్లెందుకు రూ.11 లక్షలు ఆదాయం సమకూరింది.
సత్తుపల్లి డిపోలో సంబురాలు
సత్తుపల్లిటౌన్: దసరా పండుగ సందర్భంగా సత్తుపల్లి డిపో నుంచి సోమవారం 104 సర్వీసులు నడిపించారు. హైదరాబాద్కు 25 రెగ్యులర్ సర్వీసులతో పాటు 22 అదనపు సర్వీసులు నడిపించగా మొత్తంగా 55,977 కి.మీ. బస్సులు తిరిగాయి. దీంతో 106 ఓఆర్, 67.80 ఈపీకేతో రూ.37,95,470 ఆదాయం సమకూరింది. ఈమేరకు మంగళవారం డిపోలో కండక్టర్లు, డ్రైవర్లు, ఉద్యోగులతో కలిసి డీఎం ఊటుకూరి సునీత కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ పి.విజయశ్రీ, ఎంఎఫ్ ఎస్.సాహితి, వీబీఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించి మరేది లేదని ప్రయాణికులకు ఉన్న నమ్మకం మరోమారు రుజువైంది. అందుకే పండుగ సెలవుల్లో గమ్యస్థానాలకు చేరేందుకు ఎక్కువ మంది ఆర్టీసీనే ఆశ్రయించారు. ఇందుకు అనుగుణంగా మా సిబ్బంది శ్రమించారు. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో సేవలందిస్తాం.
– ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్

ఆర్టీసీకి దసరా బొనాంజా!

ఆర్టీసీకి దసరా బొనాంజా!