
రైతు వద్దకు శాస్త్రవేత్తలు
సైదాపూర్: వ్యవసాయ క్షేత్రాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వెళ్లి రైతులకు వారి అనుభవాలతోపాటు నూతన విధానాలను వివరిస్తూ సాగులో మెలకువలు నేర్పుతారని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. రైతు బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశం మేరకు ఈనెల 5 నుంచి గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల వద్దకెళ్లి నూతన వ్యవసాయ పద్ధతులను వివరిస్తున్నారన్నారు. ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న భారత్లో మరింత వ్యవసాయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పథకాన్ని కరీంనగర్ జిల్లా సైదాపూర్లో గురువారం కోదండరెడ్డి ప్రారంభించారు. జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని 700 జిల్లాల్లో 2వేలకు పైగా శాస్త్రవేత్తల బృందాలు సుమారు 1.5కోట్ల రైతుల వద్దకు వెళ్లనున్నారన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఈనెల 29 నుంచి జూన్ 12 వరకు శాస్త్రవేత్తలు పర్యటిస్తారని అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ముఖ్యమంత్రి ఆదేశం మేరకు నెల రోజులుగా శాస్త్రవేత్తల బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. విత్తన తయారీకి తెలంగాణలో కరీంనగర్ గుండెకాయ లాంటిదని అన్నారు. త్వరలోనే ప్రతీ గ్రామంలో వ్యవసాయంపై అనుభవమున్న రైతును ఆదర్శ రైతుగా ఎంపిక చేసి గ్రామానికో భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొండా లక్ష్మణ్ వ్యవసాయ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ రాజిరెడ్డి, కోరమాండల్ ప్రతినిధి సుబ్బారెడ్డి, ఇఫ్కో ప్రతినిధి బాలాజీ, జైపాల్రెడ్డి, శాస్త్రవేత్తలు షేక్యన్ మీరా, డా.కేశవులు, సాయిరెడ్డి, సుందరం, చటర్జీ, సైదాపూర్ ఏఎంసీ చైర్మన్ సుధాకర్, ఎల్ఎస్సీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఏవో వైదేహీ, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
సైదాపూర్లో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పథకం ప్రారంభం