
లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ
● నేటి నుంచే శిక్షణ.. సామగ్రి అందజేత ● 300 మందికి శిక్షణకు ఏర్పాట్లు పూర్తి ● తొలి విడతలో 280 మంది ఎంపిక
కరీంనగర్ అర్బన్: లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం శిక్షణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. భూభారతి చట్టం అమలులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. జిల్లా కేంద్రంలోనే 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుండగా తొలివిడత 280మందిని ఎంపిక చేస్తూ సోమవారం భూ కొలతలశాఖ జాబితా విడుదల చేసింది. వారికి అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శిక్షణ సామగ్రిని అందజేశారు. మలివిడతలో మిగిలిన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భూవివాదాల శాశ్వత పరిష్కారానికి రిజిస్ట్రేషన్ల సమయంలో భూనక్షా(పటం) సమర్పించాలనే నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 17వరకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా 300మంది దరఖాస్తు చేసుకున్నారు.
సర్టిఫికెట్ల పరిశీలన
తొలుత హైదరాబాద్ గచ్చిబౌలిలోని తెలంగాణ సర్వే ట్రైనింగ్ అకాడమీలో రెండు నెలల పాటు శిక్షణ ఉంటుందని సమాచారముండగా అభ్యర్థులను నిరుత్సాహానికి గురిచేసింది. తాజాగా నోటిఫికేషన్లో ప్రస్తావించినట్లుగా జిల్లా కేంద్రంలోనే శిక్షణకు ఏర్పాట్లు చేస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. సోమవారం లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ అభ్యర్థులకు సంబంధించి సర్వే లాండ్ రికార్డ్స్ సీనియర్ అసిస్టెంట్లు సర్దార్ హర్మిందర్సింగ్, జగదీశ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. నేటినుంచి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో 150మందికి, జెడ్పీ కార్యాలయంలో మరో 150మందికి శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ వివరించారు.