
సర్వే పైసలు రాలె
● సుమారు రూ.కోటికి పైగా బకాయిలు ● ఏడు నెలలుగా ఎదురుచూపులు
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, రాజకీయ సమగ్రకుటుంబ సర్వేకు సంబంధించిన చెల్లింపుల కోసం ఎన్యుమరేటర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. నగరపాలకసంస్థ పరిధిలో సర్వే చేసిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, ఫారాల ను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన కంప్యూటర్ ఆపరేటర్లకు గౌరవ వేతనం ఇప్పటివరకు అందలేదు. గతేడాది నవంబర్లో చేపట్టిన సర్వే డిసెంబర్ వరకు కొనసాగగా, అదే నెలలో ఆన్లైన్ చేశారు. రావాల్సిన వేతనాలను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయడం లేదు.
నగరపరిధిలో..
గతేడాది నవంబర్లో కుల, సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య తదితర అంశాలతో సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టారు. నగరపాలకసంస్థలోని 60 డివిజన్లతో పాటు, అప్పటి బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లోనూ సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టారు. నగరపాలకసంస్థ దశలవారిగా 760 మంది ఎన్యుమరేటర్లను, 73మంది సూపర్వైజర్లను నియమించింది. నగరపాలకసంస్థకు చెందిన వార్డు అధికారులు, బిల్కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆర్పీలు తదితరులతో పాటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, మెప్మా ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలు,ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఎన్యుమరేటర్లుగా నియమించి ఇంటింటి సర్వే చేయించారు. పదిమంది ఎన్యుమరేటర్ల బృందానికి ఒక సూపర్వైజర్ను టీం లీడర్గా నియమించి, సర్వేను నిర్వహించారు. వీరితో పాటు నగర పాలకసంస్థకు చెందిన కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు.
ఆన్లైన్లో అప్లోడ్
సర్వే పూర్తి కావడంతోనే కుటుంబాల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్ చేసే ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం నగరపాలకసంస్థ కార్యాలయంలోని రెండు అంతస్థులతో పాటు, కలెక్టరేట్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, విట్స్కాలేజ్, శాతావాహన యూనివర్సిటీ తదితర సంస్థల్లో కంప్యూటర్ ఆపరేటర్లతో ఒక్కో కుటుంబానికి చెందిన దాదాపు 56 అంశాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దాదాపు 1200 మందికి పైగా కంప్యూటర్ ఆపరేటర్ల సేవలు వినియోగించుకున్నారు.
డబ్బుల కోసం ఎదురుచూపు
సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు సుమారు రూ.కోటికి పైగా వేతనాలు రావాల్సి ఉంది. ఏడు నెలలు గడిచినా ఆ డబ్బులు మాత్రం రావడం లేదు. ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నందుకు ఎన్యుమరేటర్లకు రూ.10 వేల చొప్పున, సూపర్వైజర్లకు రూ.12,500 చొప్పున, కంప్యూటర్ ఆపరేటర్లకు అప్లోడ్ చేసిన ఒక్కో ఫారంకు రూ.30 చొప్పున చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. ఒక్క ఎన్యుమరేటర్లకే సుమారు రూ.76 లక్షలు చెల్లించాల్సి ఉంది. నగరంలో సర్వే చేపట్టిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు సంబంధించిన డబ్బుల కోసం సీపీఓ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించామని, ఫైనాన్స్ క్లియరెన్స్ రాగానే డబ్బులు చెల్లిస్తామని నగరపాలకసంస్థ అధికారులు చెబుతున్నారు.
నగరపాలకసంస్థలో డివిజన్లు: 60
సర్వే చేసిన కుటుంబాలు: 89,617
ఎన్యుమరేటర్లు: 760
సూపర్వైజర్లు: 73
కంప్యూటర్ ఆపరేటర్లు: 1,200