
‘కల్వల’ కలవరం
● రెండేళ్లుగా మరమ్మతుకు నోచుకోని ప్రాజెక్టు ● అటకెక్కిన మినీ ఎల్ఎండీ ప్రతిపాదన ● ఏడారిని తలపిస్తున్న ప్రాజెక్టు ● వానాకాలం సాగుపై సందిగ్ధం
వీణవంక: వీణవంక– శంకరపట్నం మండలాల పరిధిలోని ఆయకట్టు ప్రాంత రైతులకు వరప్రదాయినిగా మారిన కల్వల ప్రాజెక్టు చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. రెండేళ్లక్రితం కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు గండి పడింది. నీరు దిగువకు పోతుండటంతో రైతులే చందాలేసుకుని కరకట్ట పోశారు. ఓ మోస్తరు వర్షం కురిస్తే కరకట్ట తెగిపోయే ప్రమాదం నెలకొంది. ఈ విషయమై రెండేళ్లుగా శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట మండలాలకు చెందిన రైతులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.
55 ఏళ్ల చరిత్రకు గండి
కల్వల ప్రాజెక్టు శంకరపట్నం మండలం పరిధిలో ఉన్నా.. వీణవంక, జమ్మికుంట మండలాల్లో పంటల సాగుకు కీలకం. 1950లో నిర్మించారు. 1970లో ప్రాజెక్టుగా రూపకల్పన చేయగా 55ఏళ్లుగా పూటిక తీయలేదు. ప్రాజెక్టు పరిధిలో 1200 ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వం మినీ ఎల్ఎండీగా మారుస్తామని ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదు. కనీస మరమ్మతులు కూడా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. ప్రతీసారి వరద వచ్చినప్పుడు రైతులే తాత్కాలిక కరకట్ట నిర్మించాల్సి వస్తోందని, ఈసారి చుక్కనీరు లేదని వాపోతున్నారు.
వానాకాలం సాగుపై సందిగ్ధం
మే 25న రోహిణి కార్తె ప్రవేశించనుండటంతో రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. మే 25నుంచి జూన్ 10వరకు నారుమడులు చదును చేస్తుంటారు. ఇప్పటి వరకు కల్వల చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడం, మినీ ఎల్ఎండీ ప్రతిపాదన అటకెక్కడంతో వానాకాలం సాగుపై సందిగ్ధం నెలకొంది. కల్వల దిగువన ఐదు చెక్డ్యాంలున్నాయి. ప్రాజెక్టు ఎండిపోవడంతో చెక్డ్యాంల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
ఈసారి సాగు కష్టమే
రెండేళ్ల క్రితం వర్షాలకు కల్వల ప్రాజెక్టు తెగిపోయింది. అప్పటి నుంచి మరమ్మతుకు నోచుకోవడం లేదు. రైతులందరం కలిసి రెండుసార్లు తాత్కాలిక కట్ట పోసినం. ఇసుక బస్తాలు అడ్డుగా వేసినా.. వరద వస్తే తెగిపోతుంది. శాశ్వత పరిష్కారం చూపాలని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిశాం. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈసారి సాగు కష్టమే.
– అమృత ప్రభాకర్, రైతు, వీణవంక